Employees Protest: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ పిలుపు మేరకు అంతాయిపల్లి సమీపంలోని సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం వద్ద ప్రభుత్వ ఉద్యోగులు నల్ల రిబ్బన్లతో భారీ స్థాయిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో మహా నిరసన ప్రదర్శన చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమానికి ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఛైర్మన్, తెలంగాణ నాన్ గెజెటెడ్ అధికారుల సంఘం మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు బి. రవి ప్రకాష్, మేడ్చల్ జిల్లా గెజెటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు వినోద్ ఆధ్వర్యం వహించారు.
ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ, ప్రభుత్వం ఏర్పడి 29 నెలలు గడిచినా తమ సమస్యల పరిష్కారంపై ఎలాంటి చొరవ చూపకపోవడం తీవ్ర నిరాశ కలిగించిందన్నారు. ఉద్యోగుల సమస్యల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ హామీల అమలులో కాలయాపన చేస్తోందని విమర్శించారు. ఈ కారణంగా ప్రభుత్వంపై ఉద్యోగుల్లో నమ్మకం దెబ్బతిన్నదని ఆవేదన వ్యక్తం చేశారు.మే నెల నుంచి ఇకపై ఉపేక్ష ఉండదని, ఉద్యోగుల హక్కుల సాధన కోసం ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
Also read: ఓరి నాయనా.. iPhone 15 Proపై ఏకంగా రూ.59,000 తగ్గింపు, ఎక్కడ కొనుగోలు చేయాలంటే?
ఉద్యోగులు తమ ప్రధాన డిమాండ్లుగా 52 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు, హెల్త్ స్కీమ్ తక్షణ ప్రారంభం, పెండింగ్ బిల్లుల చెల్లింపు, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు, పెండింగ్ డీఏల విడుదలను కోరారు.అనంతరం జిల్లా ఆఫీసర్ చంద్రవతికి ఉద్యోగుల సమస్యలపై విన్నప పత్రం సమర్పించారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని విస్తరించనున్నట్లు ఉద్యోగ సంఘాల నాయకులు తుద హెచ్చరిక జారీ చేశారు ఈ నిరసన కార్యక్రమంలో రమేశ్వర్ గౌడ్ బి. వెంకటేశ్వర్లూ సహదేవ్ గౌడ్, జైసింహ రెడ్డి , ధనయ్య, రాజు, ఆనంద్ రెడ్డి, విట్టల్, మధన్ రెడ్డి సుధాకర్ , రామకృష్ణ రెడ్డి , బి. భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Also read: భారత రాజకీయాల్లో చారిత్రక ఘట్టం.. మహిళా రిజర్వేషన్ బిల్లు పై..!