Telangana BJP: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో మైలేజ్ పెంచుకునేందుకు, అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి కౌంటర్ ఇచ్చేందుకు భారతీయ జనతా పార్టీ అత్యంత వ్యూహాత్మకమైన అడుగు వేసింది. ‘రైతు ఘోష.. బీజేపీ భరోసా’ పేరిట నేటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ పొలిటికల్ యాక్షన్ ప్లాన్ను అమలు చేస్తోంది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న కాషాయ పార్టీ ప్రధానంగా రైతు సమస్యలపై పోరుబాటకు సిద్ధమైంది. ప్రధానంగా ధాన్యం కొనుగోలు అంశంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రజాక్షేత్రంలోకి వెళ్లనుంది. తొలిరోజు చేవెళ్లలోని తాండూరు నుంచి ఈ యాత్ర మొదలై.. గజ్వేల్, భువనగిరి, వరంగల్, భూపాలపల్లి, మంథని, పెద్దపల్లి జిల్లాల మీదుగా మూడ్రోజులు ఈ యాత్ర కొనసాగనుంది. స్థానిక రైతులు పడుతున్న గోసను స్వయంగా అడిగి తెలుసుకోనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుతో పాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కొనుగోలు కేంద్రాల సందర్శనకు వెళ్లనున్నారు.
ఈ కార్యక్రమం కేవలం ప్రజాసమస్యలపై పోరాటం చేయడంతో పాటు.. అంతర్గతంగా పార్టీని చక్కదిద్దే పనిలో భాగంగా కూడా పలువురు చర్చించుకుంటున్నారు. ఒకే పర్యటనతో అటు రైతు సమస్యలు తెలుసుకుని ప్రజలకు చేరువ కావడం ఇటు పార్టీలో కోఆర్డినేషన్ గ్యాప్ ఏమీ లేదని చెప్పడం రైతు ఘోష.. బీజేపీ భరోసా లక్ష్యంగా ఉందని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమే ఈ యాత్ర మొదటి లక్ష్యం. మూడు రోజుల పాటు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గ్రామాల్లోనే మకాం వేయనున్నారు. రైతులతో ముఖాముఖి అయి.. వారి సమస్యలను నోట్ చేసుకోనున్నారు. ధాన్యం కొనుగోలు అంశంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టనున్నారు. రుణమాఫీ సగం మందికే కావడం, పండించిన పంటకు మద్దతు ధర దక్కకపోవడం, బోనస్ చెల్లింపుల్లో ఆలస్యం వంటి అంశాలపై నేరుగా రైతుల నుంచి లబ్ధిదారుల డేటాను సేకరించనున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను క్రోడీకరించి, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై గ్రామ సభల వేదికగా చార్జ్షీట్లు విడుదల చేసేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
Also Read: బిగ్ బీ పబ్లిక్ మీట్లో కలకలం.. అమితాబ్ను చూస్తూ స్పృహ తప్పి పడిపోయిన అభిమాని!
ఇదిలాఉండగా బీజేపీలో నేతల మధ్య ఆధిపత్య పోరుకు చెక్ పెట్టేందుకు ఈ యాత్రం ఉపయోగపడుతుందనే చర్చ జరుగుతోంది. ఇటీవలి కాలంలో తెలంగాణ బీజేపీలో గ్రూపు రాజకీయాలు, సీనియర్-జూనియర్ విభేదాలు, నేతల మధ్య సమన్వయ లోపం ఉందంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ విమర్శలన్నింటికీ ఒకేసారి చెక్ పెట్టేందుకు కూడా ఈ యాత్ర కలిసొస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పర్యటన సాగే మూడ్రోజుల పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒకే వేదికపై ఉండి కలిసి తిరిగేలా రూట్ మ్యాప్ డిజైన్ చేశారు. అంతర్గతంగా ఏవైనా భేదాభిప్రాయాలు ఉన్నా, ప్రజా సమస్యల నివారణలోనూ, పార్టీ బలోపేతంలోనూ తామంతా ఒకే తాటిపై ఉన్నామనే బలమైన సంకేతాన్ని అటు హైకమాండ్కు, ఇటు ప్రజా క్షేత్రంలో పంపేలా రంగం సిద్ధం చేసుకున్నట్లు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో నాయకులు విడివిడిగా కాకుండా కలిసి వస్తుండటంతో, అయోమయంలో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకత్వంలో మళ్లీ జోష్ నింపేందుకు ఇది ఉపయోగపడనుందని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చించుకుంటున్నారు.
ఈ యాత్ర ద్వారా బీజేపీ ఒకే దెబ్బకు రెండు పిట్టలను కొట్టాలని కమలం పార్టీ చూస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో రైతుల పక్షాన నిలబడే ఏకైక ప్రత్యామ్నాయ శక్తి బీజేపీ మాత్రమే అని నిరూపించడంతో పాటు పార్టీలో గ్రూపు తగాదాలు ఉన్నాయనే ప్రతిపక్షాల ప్రచారానికి ఫుల్స్టాప్ పెట్టడం వారి లక్ష్యంగా ఉందని చెప్పుకుంటున్నారు. అసంతృప్త నేతలను కూడా ఈ యాత్రలో భాగస్వామ్యం చేయడం ద్వారా హైకమాండ్ లైన్ దాటి ఎవరూ వెళ్లలేరనే హెచ్చరిక కూడా ఇందులో దాగి ఉందని చర్చ జరుగుతోంది. రాబోయే ఎన్నికల నాటికి పార్టీని తిరుగులేని శక్తిగా మార్చడానికి, నేతల మధ్య గ్యాప్ను పూడ్చడానికి ఈ రైతు ఘోష.. బీజేపీ భరోసా యాత్ర ఒక బలమైన సంజీవనిగా మారుతుందని భావిస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజా క్షేత్రంలో పోరాటంతో పాటు నేతల మధ్య సమన్వయం ఇలాగే కొనసాగుతుందా? లేదా అనేది చూడాలి.
Also read: మళ్లీ సెంటిమెంట్తో గెలవాలనుకుంటున్నావా కేటీఆర్.. బీజేపీ గట్టి కౌంటర్..!