KTR With Jagan: తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయా? ఎన్నికల ముందు బీఆర్ఎస్-బీజేపీ కలుస్తాయా? ఆ మాటేంటి ఏమోగానీ, కొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయా? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించేందుకు బీఆర్ఎస్ కొత్త స్కెచ్ వేసిందా? వైసీపీతో కలిసి బరిలోకి దిగాలి ప్లాన్ చేస్తోందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
రూటు మార్చిన బీఆర్ఎస్ పార్టీ
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరు. ప్రస్తుత రాజకీయాల్లో ఎవరు, ఎప్పుడు, ఏ పార్టీ వైపు ఉంటారో తెలియని పరిస్థితి. తెలంగాణలో జరుగుతున్న రాజకీయాలను జాగ్రత్తగా గమనిస్తున్నారు మాజీ సీఎం కేసీఆర్. ఈసారి అధికారంలోకి రాకుంటే పార్టీకి మరిన్ని కష్టాలు తప్పవని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త కొత్త ప్రణాళికలు వేస్తున్నట్లు తెలుస్తోంది.
తొలుత బీజేపీలో కలిసి ఎన్నికల బరిలోకి దిగాలని ఆలోచన చేసిందట బీఆర్ఎస్. జరుగుతున్న పరిణామాలు అందుకు వ్యతిరేకంగా ఉండడం, రెండోది బీఆర్ఎస్ని బీజేపీ టార్గెట్ చేయడం ఆ పార్టీ నేతలకు మింగుడుపడడం లేదు. ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాల్లో వైసీపీ సహాయం తీసుకుంటే ఎలా ఉంటుందని గులాబీ బాస్ ఆలోచన చేయడం, ఆపై వర్కింగ్ ప్రెసిడెంట్ తెలపడం జరిగిపోయిందట.
వైసీపీతో కలిసి బరిలోకి దిగేందుకు బీఆర్ఎస్ కసరత్తు
ఇటీవల బెంగుళూరులోని ఓ కార్యక్రమానికి జగన్-కేటీఆర్ల హాజరయ్యారు. వీరి మధ్య రాబోయే అసెంబ్లీ ఎన్నికల గురించి చర్చ జరిగిందట. ఆ విషయం బీఆర్ఎస్ పార్టీలోని కొందరు పెద్దల చెవిలో పడింది. బీఆర్ఎస్-వైసీపీ కలిసి పోటీ చేస్తే మంచి ఫలితాలు వస్తాయని నేతలు అన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో వైసీపీతో బీఆర్ఎస్ దోస్తీ మరింత దగ్గరైందని అంటున్నారు.
ఈ నేపథ్యంలో బుధవారం ఖమ్మం జిల్లా పర్యటనకు వెళ్లిన కేటీఆర్కు, వైసీపీ కార్యకర్తలు స్వాగతం పలికారని అంటున్నారు. ఒకవిధంగా చెప్పాలంటే ఈ రెండు పార్టీలు ఒక్కటేనని అంటున్నారు. బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో జగన్ గెలిచేందుకు తనవంతు ప్రయత్నాలు చేసిందని అంటున్నారు.
ALSO READ: అమెరికాలో తెలుగు యువతి దారుణ హత్య.. హైదరాబాద్ కు చేరుకున్న నిఖిత మృతదేహం
వైసీపీకి ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో మద్దతుదారులు ఉన్నారని అంటున్నారు. ఆయా జిల్లాల్లో రెడ్డీల ప్రాబల్యం బలంగా ఉందని బీఆర్ఎస్ పెద్దలు నమ్ముతున్నారు. జగన్తో కలిసి పోటీ చేయడం వల్ల ఆ కమ్యూనిటీ ఓటు బ్యాంకు బద్దలు కొట్టవచ్చని లెక్కలు వేసుకుంటున్నారు.
అదే జరిగితే 2029 ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవడం ఈజీ అవుతుందని అంటున్నారు. ప్రస్తుతం దీనిపై చర్చలు తొలి దశలో ఉన్నాయని కొందరు నేతల మాట. మొత్తానికి రేవంత్ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు కేసీఆర్ పెద్ద స్కెచ్ వేస్తున్నట్లు ఆ పార్టీ నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. దీనిపై రాబోయే రోజుల్లో ఇంకెన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.