KCR Comeback: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహాన్ని, అదే సమయంలో భవిష్యత్తుపై గట్టి ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల పార్లమెంట్లో తెలంగాణ ఏర్పాటును పాకిస్థాన్ విభజనతో పోల్చుతూ బీజేపీ ఎంపీ మాట్లాడుతుంటే, రాష్ట్రానికి చెందిన ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు నోరు మెదపకుండా మౌనంగా ఉండిపోయారని మండిపడుతున్నారు. అదే స్థానంలో గులాబీ జెండా (బీఆర్ఎస్) ఎంపీ ఉండి ఉంటే అసలు ఊరుకునేవారా, పార్లమెంట్ను స్తంభింపజేసేవారు కదా అని గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బంగాళఖాతంలో కలిపేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, తిరిగి కేసీఆర్ను అధికారంలోకి తెచ్చుకోవాలనే బలమైన ఆకాంక్ష జనాల్లో స్పష్టంగా కనిపిస్తోందని చెబుతున్నారు.
హైదరాబాద్ నగర దాహార్తిని తీర్చేందుకు కేసీఆర్ ప్రభుత్వం కొండపోచమ్మ సాగర్ను నిర్మించిందని, అక్కడి నుంచి గ్రావిటీ కాలువ ద్వారా గండిపేటకు గోదావరి నీళ్లను తీసుకొచ్చేలా అద్భుతమైన ప్రణాళిక చేసిందని గుర్తు చేస్తున్నారు. మూసీ నదిపై 15 బ్రిడ్జీలను మంజూరు చేయడంతో పాటు, ఉప్పల్ భగాయత్ నుంచి నాగోల్ వరకు మూసీ సుందరీకరణ చేపట్టింది కేసీఆర్ ప్రభుత్వమేనని స్పష్టం చేస్తున్నారు. కానీ, ఇప్పుడు కేసీఆర్ హయాంలో కట్టిన బిల్డింగ్లు, ఫ్లైఓవర్లకు సీఎం రేవంత్ రెడ్డి కేవలం రిబన్ కటింగ్లు చేస్తూ ‘కటింగ్ మాస్టర్’గా మారాడని ఎద్దేవా చేస్తున్నారు. కేవలం 16 వేల కోట్లతోనే మూసీ సుందరీకరణ సాధ్యమైతే, లక్ష కోట్లు ఎందుకు కేటాయిస్తున్నారని ప్రశ్నిస్తే ప్రభుత్వం ఎదురుదాడికి దిగుతోందని, అంబర్పేటలో వేలాది ఇళ్లను కూల్చేందుకు కుట్రలు చేస్తోందని ఆరోపిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఒత్తిడులు తెచ్చినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా కేసీఆర్ ఉన్నంత కాలం రైతుల బావుల వద్ద గానీ, ఇళ్లలో గానీ కరెంట్ మీటర్లు పెట్టనివ్వలేదని గుర్తు చేస్తున్నారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి తనపై ఉన్న కేసుల భయంతో ప్రధాని మోడీ ‘తానా’ అంటే ‘తందానా’ అంటూ రాష్ట్రంలో మామూలు మీటర్లు తీసేసి ప్రీపెయిడ్ మీటర్లు, రైతుల ట్రాన్స్ఫార్మర్ల దగ్గర మీటర్లు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడుతున్నారు. ఉచిత కరెంట్ అంటూనే వెనుక నుంచి మీటర్లు తెస్తున్న ఈ ఇందిరమ్మ రాజ్యం పోవాలంటే మళ్లీ కేసీఆర్ రాక తప్పదంటున్నారు.
పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే ఎస్ఐఆర్ (SIR) విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా నాలుగు ముఖ్యమైన పనులు చేయాల్సి ఉంటుంది. చనిపోయిన వారి ఓట్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించడం, అలాగే అర్హులైన కొత్త ఓటర్లను జాబితాలో చేర్చడం మొదటి రెండు పనులు. దీంతో పాటు నియోజకవర్గం వదిలి వెళ్లిపోయిన వారి ఓట్లను తొలగించడం, కొత్తగా నియోజకవర్గంలోకి వచ్చిన వారి ఓట్లను నమోదు చేయించడం లాంటి పనులపై బీఆర్ఎస్ కార్యకర్తలు దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.
మరో ఏడాదిన్నర పాటు ఓపిక పడితే కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని, ఆయన వస్తేనే రాష్ట్రానికి మంచి రోజులొచ్చి, భూముల ధరలు పెరుగుతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లు కూలగొట్టే ఈ కాంగ్రెస్ పాలన అంతం కావాలంటే రాష్ట్రంలో మళ్లీ గులాబీ జెండా ఎగరాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు.
Also Read: రైలుపై ఆత్మాహుతి దాడి.. రెండు డజన్లు పైగానే మృతి, మరో 70 మందికి గాయాలు