BRS On Coal Mines: తెలంగాణలో రాజకీయాలు నైని బొగ్గు గనుల చుట్టూ తిరుగుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా గడిచిన మూడురోజులు దీనిపై హాట్ హాట్గా చర్చ సాగుతోంది. ఈ వ్యవహారంపై తొలిసారి నోరు విప్పింది బీఆర్ఎస్ పార్టీ. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఆ పార్టీ నేత హరీష్రావు.
బొగ్గు చుట్టూ తిరుగుతున్న తెలంగాణ రాజకీయాలు
ఓవైపు ఎన్టీవీ.. ఇంకోవైపు ఏబీఎన్ కథనాలతో తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారి వేడెక్కాయి. రెండు ఛానెళ్ల కథనాల వెనుక బొగ్గు గనుల ఉన్నాయంటూ ఆరోపణలు లేకపోలేదు. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క క్లారిటీ ఇచ్చారు. మా ప్రభుత్వంలో ఎలాంటి అవకతవకలకు అవకాశం లేదని కుండబద్దలు కొట్టేశారు.
కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తూ ప్రభుత్వంపై అపోహాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నాయని అన్నారు. శుక్రచార్యుడు-మారీచుడు-సుబాహుడు బలపడటానికి సహకరిస్తున్నారని కౌంటర్ ఎటాక్ మొదలుపెట్టారు. ఇలాంటివి రాసే ముందు వివరణ అడిగితే చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎం స్వయంగా వెల్లడించారు. పిలిచిన టెండర్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు డిప్యూటీ సీఎం.
సీబీఐ విచారణకు బీఆర్ఎస్ డిమాండ్
ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ పార్టీ నోరు విప్పింది. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్రావు సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక కుంభకోణాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి-మంత్రుల మధ్య వాటాల పంచాయతీ నడుస్తోందని విమర్శలు గుప్పించారు. సోమవారం ఉదయం మీడియా ముందుకొచ్చిన ఆయన, కీలక వ్యాఖ్యలు చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి-బీజేపీకి ఎలాంటి చీకటి ఒప్పందం లేకపోతే నైని కోల్ బ్లాక్ టెండర్లపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి సింగరేణిలో 49 శాతం వాటా ఉందని, వెంటనే దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డిని డిమాండ్ చేశారు. ఈ విషయంలో తనవద్దనున్న ఆధారాలు ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని తేల్చి చెప్పారు.
ALSO READ: కవితతో ప్రశాంత్ కిషోర్ భేటీ.. బీఆర్ఎస్కు ముచ్చెమటలు
రెండేళ్లుగా సింగరేణికి ఒక సీఎండీ లేరని, ఇన్ఛార్జ్ ఎండీలను పెట్టి అడ్డగోలుగా నడిపిస్తున్నారని తూర్పార బట్టారు. సైట్ విజిట్ చేసే విధానం గతంలో లేదన్నారు మాజీ మంత్రి. బొగ్గుగని కాంటాక్ట్ను బంధువులకు ఇచ్చేందుకు సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానం ప్రభుత్వం తెచ్చిందన్నారు.
సింగరేణిలో సైట్ విజిట్ విధానం వెంటనే రద్దు చేయాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను డిమాండ్ చేశారు. సింగరేణిలో సమర్థవంతమైన అధికారిని నియమించాలని కోరారు. బొగ్గు గనుల కాంటాక్ట్ కోసం IAS అధికారులు-జర్నలిస్టులను బలి పశువులు చేశారన్నారు.
ముఖ్యమంత్రి అంజయ్యను అవమానించిందే ఆనాటి ప్రధాని రాజీవ్ గాంధీ అని, కాంగ్రెస్ భూస్థాపితం అయినప్పుడే NTR ఆత్మ శాంతిస్తుందన్నారు. నైని బ్లాక్ కాంట్రాక్ట్ రద్దు చేయడం సంతోషమని, డిప్యూటీ సీఎం మీద వచ్చిన వార్తల వెనుక ఎవరు ఉన్నారో బయట పెట్టాలన్నారు. లేదంటే జరుగుతున్న వ్యవహారంపై హైకోర్టుకు వెళ్తామని, CBIకి పిర్యాదు చేస్తామన్నారు మాజీ మంత్రి హరీష్రావు.
సీఎం రేవంత్ రెడ్డికి, బీజేపీకి ఎలాంటి చీకటి ఒప్పందం లేకపోతే నైని కోల్ బ్లాక్ టెండర్లపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలి
కేంద్ర ప్రభుత్వానికి సింగరేణిలో 49% వాటా ఉంది
వెంటనే దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నా
— BIG TV Breaking News (@bigtvtelugu) January 19, 2026