Minister Adluri: జూబ్లీహిల్స్ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి కర్రుకాల్చి వాత పెట్టడంతో కడుపు మండి ఎన్నిక సరిగా జరగలేదంటూ దుష్ప్రచారాలు చేస్తున్నారని సంక్షేమ శాఖ మంత్రి మండిపడ్డారు. ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు బుద్ధి తెచ్చుకోవాలని సూచించారు.
జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. పలు మండలాల్లో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపొందడంతో ధర్మారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన విజయోత్సవ సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. కార్యకర్తలకు స్వీట్స్ తినిపించి, టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలపై , ప్రజల్లో నమ్మకం ఉందని చెప్పడానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నిదర్శనమన్నారు. నిన్న మొన్నటి వరకు తామే గెలుస్తామని చెప్పుకున్న బీఆర్ఎస్ నాయకుల నోటి మాటలకు జూబ్లీహిల్స్ ప్రజలు తాళం వేశారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజలు ఇచ్చిన తీర్పును జీర్ణించుకోలేకే, ఎన్నికల ప్రక్రియపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు తమ తీరును మార్చుకోవాలని హితవుపలికారు. జూబ్లీహిల్స్ ప్రజలు ఇచ్చిన తీర్పుతో తమ ప్రభుత్వం పై బాధ్యత మరింత పెరిగిందని, సంక్షేమ పథకాల పై ప్రజలు విశ్వాసంగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్షా పార్టీలు ఎన్ని విషప్రచారాలు చేసిన, ప్రజలు నమ్మరని అన్నారు.
Also Read: కేసీఆర్ ఆరోగ్యం సరిగ్గా లేదు.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తిరుపతి రెడ్డి తోపాటు పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.