BRS-BJP: తెలంగాణలో రాజకీయాలు క్రమంగా మారుతున్నాయా? బీజేపీ-బీఆర్ఎస్ కూటమిగా ఏర్పడుతున్నాయా? ఇటీవల జరుగుతున్న పరిణమాలే అందుకు కారణమా? కేసీఆర్తో బీజేఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి సమావేశం వెనుక ఏం జరిగింది? కేసీఆర్ ఎలాంటి సంకేతాలు ఇచ్చారు? రాబోయే ఎన్నికల్లో ఈ రెండూ కలిసే పోటీ చేస్తాయా? అవుననే అంటున్నాయి రాజకీయ పార్టీలు.
కొద్దిరోజుల కిందట సీఎం రేవంత్రెడ్డి ఓ మాట చెప్పారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని మనసులోని మాట బయట పెట్టారు. ఆ విషయాన్ని చాలా మంది లైట్గా తీసుకున్నారు. అవన్నీ రాజకీయ ఆరోపణలుగా తేలిగ్గా తీసుకున్నారు. ముఖ్యమంత్రి మాట వెనుక అసలు లోగుట్టు క్రమంగా బయటపడుతోంది. రీసెంట్గా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన పూర్తి చేసుకుంది.
అధికార పార్టీ విజయోత్సవాలు జరుపుకుంటోంది. విజయోత్సవాలను డైవర్ట్ చేసేందుకు ఓ వైపు బీజేపీ, మరోవైపు బీఆర్ఎస్ తన ప్రయత్నాలు మొదలుపెట్టాయి. తొలుత వారం కిందట కాంగ్రెస్ పాలనపై బీజేపీ ఛార్జిషీటు పేరుతో ప్రజల్లోకి వెళ్లింది. లేటెస్ట్గా బీఆర్ఎస్ కూడా అదే చేసింది. రెండు పార్టీల జెండాలు వేరు.. అజెండా మాత్రం ఒక్కటేనని అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నామ్ చేసేందుకు వేసిన ఎత్తుగడలో భాగమన్నది నేతల మాట.
సోమవారం అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఆదివారం రాత్రి కేసీఆర్తో బీజేఎల్సీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి సమావేశమయ్యారు. తన కుమార్తె వివాహానికి కావాలని కేసీఆర్ను కోరినట్టు అందులోని పైకి వచ్చిన సారాంశం. తన కూతురు వివాహానికి ఆహ్వానించేం దుకు కేసీఆర్ వద్దకు వచ్చానని, మా మధ్య ఎలాంటి చర్చలు జరగలేదని తెలిపారు.
ALSO READ: తెలంగాణకు మళ్లీ పెట్టుబడుల రాక.. ఉపాధికి ఇక ఢోకా ఉండదు.. మంత్రి శ్రీధర్ బాబు
నార్మల్గా వేర్వేరు పార్టీల ముఖ్య నేతలు కలిస్తే రాజకీయాల గురించి మాట్లాడుకోవడం సహజం. అందులోనూ సోమవారం నుంచి తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇరువురు నేతల మధ్య అసెంబ్లీ ఎజెండా ఖరారైనట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ముప్పేట దాడి చెయ్యాలని స్కెచ్ వేసినట్టు బీఆర్ఎస్ వర్గాల నుంచి ఓ ఫీలర్ బయటకు వచ్చింది.
నాలుగురోజుల కిందట నేతల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. గడిచిన ఏడాది బీఆర్ఎస్ అనేక ఆటుపోట్లు ఎదుర్కొందన్నారు. ఎప్పుడూ లేని విధంగా సమస్యలు వచ్చి పడ్డాయని మనసులోని మాట బయటపెట్టారు. రాజకీయ విశ్లేషకులు ఇక్కడ రెండు విషయాలు చెబుతున్నారు. లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ కావడం ఒకటైతే, రెండోది నేతలు వలస పోవడం.
ఈ రెండూ బీఆర్ఎస్ తొలి వైఫల్యంగా చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ఏడాదిలో బీఆర్ఎస్కు ఎలాంటి సమస్యలు క్రియేట్ చేయలేదు. ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్ల లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ పాలనలో దేనిపైనా విచారణ చేసుకోవచ్చని ఆ పార్టీ నేతలు ఓపెన్గా అసెంబ్లీలో ప్రకటించారు. దీంతో రేవంత్రెడ్డి సర్కార్ ఆరోపణలు వచ్చిన వాటిపై ఇంకా విచారణ జరిపిస్తోంది.
రాబోయే మూడు నెలల్లో మేడిగడ్డ, విద్యుత్ కొనుగోలు, ఫార్ములా ఈ రేసు వంటి అంశాలు ఓ కొలిక్కి రావచ్చని అంటున్నారు. ఇది ముందుగానే భావించి బీజేపీ-బీఆర్ఎస్ ఒకతాటి మీదకు వచ్చాయని అంటున్నారు. మొత్తానికి బీజేపీ-బీఆర్ఎస్ మధ్య ఏదో జరుగుతోందని ప్రజలు చర్చించుకోవడం కొసమెరుపు.