తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన ఫామ్ హౌస్ వేదికగా పార్టీ ముఖ్య నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. శనివారం ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్కు చేరుకున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కేసీఆర్తో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిన ‘ఫోన్ ట్యాపింగ్’ విచారణ అంశం ఈ భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
గత కొద్ది రోజులుగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ విచారణలో వెలుగు చూస్తున్న అంశాలు, దర్యాప్తు సంస్థల దూకుడుపై కేసీఆర్, కేటీఆర్ లోతుగా చర్చించారు. ముఖ్యంగా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టే వ్యూహాలపై వారు మంతనాలు జరిపినట్లు సమాచారం. చట్టపరంగాను, రాజకీయంగాను ఈ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలనే దానిపై గులాబీ బాస్ దిశానిర్దేశం చేసినట్లు పార్టీ వర్గాల టాక్.
మరోవైపు.. కేటీఆర్తో భేటీ ముగిసిన వెంటనే మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఎర్రవల్లికి వెళ్లనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ముగ్గురూ కలిసి పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. కేవలం ఫోన్ ట్యాపింగ్ అంశమే కాకుండా, త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల పైన కూడా వీరు దృష్టి సారించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పట్టు నిలుపుకోవడం కోసం అనుసరించాల్సిన వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక, ప్రచార పర్వంపై క్షేత్రస్థాయి నివేదికలను వీరు సమీక్షించనున్నారు.
ప్రభుత్వం తమను టార్గెట్ చేస్తోందని భావిస్తున్న బీఆర్ఎస్, ఇప్పుడు ఎదురుదాడికి సిద్ధమవుతోంది. మున్సిపల్ ఎన్నికల ద్వారా తిరిగి ఫామ్లోకి రావాలని భావిస్తున్న కేసీఆర్, కీలక నేతలకు స్పష్టమైన బాధ్యతలు అప్పగించనున్నారు. మొత్తానికి ఎర్రవల్లి వేదికగా జరుగుతున్న ఈ కీలక భేటీలు తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మలుపులు తిప్పుతాయోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ALSO READ: BRS : ఫోన్ ట్యాపింగ్ కేసులో నెక్ట్స్ ఎవరు?