BRS Leaders: కరీంనగర్ ఘటనల నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం డీజీపీ సీ.వీ.ఆనంద్ ను కలిశారు. బీఆర్ఎస్ నేతలపై జరుగుతున్న వరుస దాడులను ప్రస్తావించారు. కరీంనగర్ లో జరిగిన దాడులతో కేంద్ర మంత్రి బండి సంజయ్ కు సంబంధం ఉందని ఆరోపిస్తూ ఆయనపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఫిర్యాదును డీజీపీకి అందచేశారు.
కరీంనగర్ లో గురువారం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కారుతో పాటు ఆయన క్యాంప్ ఆఫీస్, మరో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర రెడ్డి, కే.పీ.వివేకానంద, పాడి కౌశిక్ రెడ్డి, దేశపతి శ్రీనివాస్, డాక్టర్ దాసోజు శ్రవణ్, కల్వకుంట్ల సంజయ్ లు డీజీపీని కలిశారు. కౌశిక్ రెడ్డికి భద్రత కల్పించాలని కోరారు. దాంతోపాటు కరీంనగర్ లో జరిగిన హింసాత్మక సంఘటనలకు సంబంధించి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ ని నిందితునిగా చేర్చాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పట్ల బండి సంజయ్ చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలపై విడిగా మరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నారు. కేసులో నిష్పాక్షిక దర్యాప్తు జరిగేందుకు సీనియర్ అధికారికి అప్పగించాలని పేర్కొన్నారు. బాధిత ఎమ్మెల్యే, ప్రత్యక్ష సాక్షుల స్టేట్ మెంట్లు రికార్డు చేసి నిర్ణీత కాలవ్యవధిలో విచారణ పూర్తి చేయాలన్నారు. కరీంనగర్ లో బీజేపీ కార్యకర్తలు దాడులు చేసినా వారిని అడ్డుకోలేక పోయిన పోలీసులతోపాటు ఎఫ్ఐఆర్ ను తారుమారు చేసిన అధికారులపై క్రిమినల్, క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పీఎంజే జువెలరీ షాపు దోపిడీని నివారించటంలో విఫలమైన సిబ్బందిపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు.
Also Read: TVK Petition: గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. సుప్రీంకోర్టులో టీవీకే పిటిషన్.. విజయ్ వ్యూహం ఏంటి?
అనంతరం మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ నాయకులు రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. పట్టపగలు దోపిడీ దొంగలు కాల్పులు జరిపి మరీ జువెలరీ షాపులో దోపిడీ చేశారని.. తాజాగా రిటైర్డ్ డీజీ భార్యను దారుణంగా హత్య చేసి లూటీకి పాల్పడ్డారని అంటూ లా అండ్ ఆర్డర్ ఇదేనా? అని ప్రశ్నించారు. ఓవైపు వరుసగా నేరాలు జరుగుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్ కు తరుచూ వెళ్తూ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
Also Read: సెకండ్ హ్యాండ్ కార్లలో ఫేక్ ఎయిర్ బ్యాగ్స్.. అలర్ట్ గా లేకపోతే అంతే సంగతులు!