BRS: ఖమ్మం వేదికగా బీఆర్ఎస్ ఆవిర్భావ సభ ముగిసింది. ఇక నెక్స్ట్ ఏంటీ..? కేసీఆర్ ఏం చేయబోతున్నారు.. బీఆర్ఎస్ ను ఎలా విస్తరింపజేస్తారు.. ఇప్పుడిదే రాజకీయవర్గాల్లో చర్చ. అయితే ఏపీలోని వైజాగ్ కేంద్రంగా ఈ సారి గులాబీబాస్ భారీ బహిరంగసభకు ముహుర్తం సిద్ధం చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఆ సభలోనే స్టీల్ ప్లాంట్ అంశంపై కేంద్రాన్ని నిలదీస్తూ.. ఏపీలోని పార్టీలను ఇరుకునపెట్టేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం.
జాతీయ రాజకీయాలే లక్ష్యంగా ఖమ్మంలో తొలి సభను నిర్వహించిన బీఆర్ఎస్.. మలి సభను ఏపీలోని విశాఖపట్నంలో నిర్వహించేందుకు కసరత్తు మొదలుపెట్టింది. ఏపీకి చెందిన పలువురు నేతలు ఇటీవల బీఆర్ఎస్ లో చేరారు. ఈ క్రమంలో ఆ రాష్ట్రంలో పార్టీ విస్తరణ కోసం సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకుగాను ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ తో సీఎం కేసీఆర్ ఇప్పటికే చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. విశాఖలో సభావేదిక ఏర్పాటు, నిర్వహణ తేదీలను త్వరలోనే వెల్లడించనున్నారు.
విశాఖలో చేపట్టనున్న బహిరంగ సభ ద్వారా దేశంలో గుణాత్మక మార్పు సందేశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఏపీ తర్వాత మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక నుంచి కూడా చేరికలు ఉంటాయని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత అడుగు కర్ణాటక వైపు వేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకుగాను రాజకీ యంగా ఏదో ఒక పార్టీలో కొనసాగుతూ.. కర్ణాటకలో నివసిస్తున్న తెలుగువారు, తెలంగాణ మూలాలున్న వారిని ఎంచునున్నట్లు సమాచారం.
ఏపీలోని అధికార వైఎస్సార్సీపీతోపాటు, టీడీపీ, జనసేన పార్టీల్లోని అసంతృప్త, పార్టీ టికెట్ పై అనుమానం ఉన్న నేతలను బీఆర్ఎస్ గూటికి రప్పించేందుకు గులాబీ బాస్ వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది. బీఆర్ ఎస్ లోకి వచ్చేందుకు ఆసక్తి చూపే నేతలతో కేసీఆర్ స్వయంగా మాట్లాడి.. పార్టీలోకి చేర్చుకుంటారని చెబుతున్నారు. పార్టీని క్షేత్రస్థాయికి తీసుకువెళ్లేందుకు త్వరలోనే ఏపీలో బహిరంగ సభ, ర్యాలీలు చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నారు.
ఏపీలో బీఆర్ఎస్ సభ విశాఖలో పెట్టాలనుకోవడం కేసీఆర్ వ్యూహంలో భాగమే. విశాఖ ఉక్కును కేంద్రం ప్రైవేటీకరిస్తున్న వేళ.. మోదీపై వ్యతిరేకతను పార్టీ బలోపేతానికి ఉపయోగించుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రజలకు చేరువు కావడానికి విశాఖ ఉక్కు అంశం బాగా కలిసివస్తుందని కేసీఆర్ లెక్కలు వేస్తున్నారు. ఏపీ బీఆర్ఎస్ నేతల చేరిక సమయంలో కూడా కేసీఆర్ ప్రత్యేకంగా విశాఖ అంశాన్నే ప్రస్తావించారు. విశాఖ ఉక్కుపై ఇప్పటికే జనసేన, టీడీపీ పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు చేశాయి. ఆ తర్వాత సైలెంట్ అయ్యాయి.ఇప్పుడు మళ్లీ బీఆర్ఎస్ విశాఖ ఉక్కు అంశాన్ని వ్యూహాత్మకంగా ప్రస్తావిస్తూ బీజేపీతో పాటు ఇతర పార్టీల్ని కార్నర్ చేసే పనిలో పడింది.
వాస్తవానికి ఏపీలో బీఆర్ఎస్ మొదటి సభ విజయవాడలోనే కేసీఆర్ పెడతారని రాజకీయ విశ్లేషకులు భావించారు. కానీ కేసీఆర్ ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టు విశాఖలో మెగా సభకు ముహూర్తం సిద్ధం చేసుకుంటున్నారు. విశాఖలో మీటింగ్ తర్వాత ఉత్తరాంధ్ర ఓటర్లను, నేతల్ని బీఆర్ఎస్ వైపు తీసుకొచ్చేందుకు ఉపయోగపడుతుందని లెక్కలు వేస్తున్నారు. పనిలో పనిగా ప్రత్యేక హోదా అంశాన్ని కూడా ఈ సభలో కేసీఆర్ ప్రస్తావించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఏపీలో సభను సక్సెస్ చేసిన తర్వాత ఇతర ప్రాంతాలపై కేసీఆర్ ఫోకస్ పెట్టబోతున్నారు. ఉత్తర భారత ప్రజలకు కూడా పార్టీని చేరువ చేసేందుకు కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా.. ఉత్తరప్రదేశ్, పట్నాలో సభలు నిర్వహించాలని భావిస్తున్నారు. మహారాష్ట్రలోనూ బీఆర్ఎస్ విస్తర ణలో భాగంగా రైతులు, ఇతర వర్గాలకు చెందిన వారిని కలుపుకొని భారీ ర్యాలీకి కసరత్తు చేస్తున్నట్లు తెలిస్తోంది.