BRS party latest news(Today breaking news in Telangana): తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు మహారాష్ట్రలోని నాందేడ్కు వెళ్లనున్నారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ట్రైనింగ్ సెషన్స్ ప్రారంభించనున్నారు. ఈ శిక్షణా తరగతులు రెండురోజులపాటు నిర్వహిస్తారు. అక్కడే బీఆర్ఎస్ పార్టీ మొట్టమొదటి ఆఫీస్ను కూడా కేసీఆర్ ప్రారంభించబోతున్నారు.
మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన పార్టీ ముఖ్య నాయకులను మాత్రమే శిక్షణా శిబిరాలకు ఆహ్వానించారు. ఒక్కో నియోజకవర్గం నుంచి ముగ్గురు ప్రతినిధులను ఎంపిక చేశారు. మరో 100 మందికిపైగా ముఖ్య నేతలు కూడా ఈ ట్రైనింగ్ సెషన్స్కు వస్తారని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి.
ఇక మహారాష్ట్రలో ఈ నెల 22 నుంచి జూన్ 22 వరకు నెల రోజులపాటు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బీఆర్ఎస్ చేపడుతుంది. సాధారణ, క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియ ముమ్మరం చేయాలని పార్టీ నేతలను కేసీఆర్ ఆదేశించారు. గ్రామస్థాయిలో భారీగా చేపట్టాలని లక్ష్యాన్ని విధించారు. గ్రామస్థాయి పార్టీ కమిటీలు, అనుబంధ కమిటీల్లో ఎక్కువగా మహిళలు, రైతులకు ప్రాధాన్యం ఇవ్వాలని మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలకు సూచించారు. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ బీఆర్ఎస్ ఆఫీసుల నిర్మాణానికి ప్రణాళికలు రచిస్తున్నారు. మే నెలాఖరులో ఔరంగాబాద్లో పార్టీ ఆఫీసు నిర్మాణానికి కేసీఆర్ భూమి పూజ చేస్తారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.
కేసీఆర్ పర్యటన వేళ నాందేడ్ వ్యాప్తంగా భారీగా స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్, దేశ్ కీ నేత కైసే హో కేసీఆర్ జైసే హో.. దేశ్ కీ నేత కేసీఆర్ లాంటి నినాదాలతో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నాందేడ్ విమానాశ్రయం, రైల్వేస్టేషన్, ప్రధాన కూడళ్లలో గులాబీ ఫ్లెక్సీలు సందడి చేస్తున్నాయి.