తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై ఆ పార్టీకి చెందిన మహిళా నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇటీవల కవిత చేసిన కొన్ని వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో చిచ్చు రేపాయి. ముఖ్యంగా టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడం తనకు ఇష్టం లేదని ఆమె వ్యాఖ్యానించడంపై సొంత పార్టీ నేతలే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన పలువురు మహిళా నేతలు ఆమె తీరును తప్పుబడుతూ ఘాటు విమర్శలు చేశారు.
కవిత రాజకీయ భవిష్యత్తుపై మహిళా నేతలు సూటిగా స్పందించారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్లో కవిత ఓడిపోయినప్పుడు.. ఆమె పడ్డ బాధను చూడలేక తండ్రిగా కేసీఆర్ ఎంతో ఆవేదన చెందారని వారు గుర్తు చేశారు. కూతురి రాజకీయ జీవితం ఆగిపోకూడదనే ఉద్దేశంతోనే.. పార్టీలో ఇతరులకు అవకాశం ఉన్నా పక్కన పెట్టి ఆమెకు రెండుసార్లు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని మండిపడ్డారు. ‘ప్రాధాన్యత లేకపోతే మీకు రెండుసార్లు ఎమ్మెల్సీ పదవి ఎలా ఇచ్చారు? అది కేసీఆర్ పెట్టిన భిక్ష కాదా?’ అని వారు ప్రశ్నించారు.
టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడం తనకు ఇష్టం లేదని ఇప్పుడు చెబుతున్న కవిత.. మరి తను స్థాపించిన తెలంగాణ జాగృతిని భారత జాగృతిగా ఎందుకు మార్చారని మహిళా నేతలు నిలదీశారు. పార్టీ పేరు మార్పును వ్యతిరేకించే వ్యక్తి, తన సొంత సంస్థ పేరులో తెలంగాణను తొలగించి భారత్ అని ఎలా పెట్టుకున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కచ్చితంగా కవిత ద్వంద్వ నీతికి నిదర్శనమని.. కేవలం సానుభూతి కోసమే ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.
పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నాయకురాలిగా అందరినీ ఏకం చేయాల్సింది పోయి, ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వల్ల పార్టీ కేడర్లో గందరగోళం నెలకొంటుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. పదవులు అనుభవించినప్పుడు లేని అభ్యంతరాలు, ఇప్పుడు అధికారం పోయాక వ్యక్తం చేయడం వెనుక అంతరార్థం ఏంటని ప్రశ్నించారు. కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలను తప్పుబట్టడం అంటే పార్టీని బలహీనపరచడమేనని వారు హెచ్చరించారు.
ALSO READ: New Political Party: రాజకీయ పార్టీగా ‘తెలంగాణ జాగృతి’.. గన్పార్క్ వద్ద కవిత సంచలన ప్రకటన