ZPTC Elections: స్వేచ్ఛ బ్యూరో: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు తెలిసింది. మంత్రుల నుంచి వేర్వేరు అభిప్రాయాలతో రసవత్తంగా చర్చ జరిగింది. ఈ ఎన్నికలను ఎప్పుడు నిర్వహించాలనే దానిపై ఒక్కో మంత్రి తమ అభిప్రాయాలను వ్యక్త పరిచారు. సోమవారం జరిగిన కేబినెట్ భేటీలో ఈ అంశంపై మంత్రుల మధ్య జరిగిన చర్చ రసవత్తరంగా సాగినట్లు సమాచారం. ఎన్నికలకు వెళ్లాలా? వద్దా? అనే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడంతో నిర్ణయం క్లిష్టంగా మారింది.
కొందరు మంత్రులు ఎన్నికలకు వెళ్దామని పేర్కొనగా, మరి కొందరు కొన్ని రోజుల వరకు వెయిట్ చేస్తే బాగుంటుందని అభిప్రాయాలను వెల్లడించారు. ఇప్పటికే గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ముగినందున, ఇదే జోష్ పై వెళ్లాలని కొందరు మంత్రులు అభిప్రాయాలను తెలియజేశారు. ఆలస్యం చేయకుండా పరిషత్ ఎన్నికలు కూడా పూర్తి చేస్తే గ్రామ స్థాయిలో పార్టీకి మరింత పట్టు వస్తుందని వెల్లడించారు. కానీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, అలాగే బీసీ రిజర్వేషన్ల(BC Reservations) పై సాగుతున్న కసరత్తు లు పూర్తి కాకుండా ఎన్నికలకు వెళ్లడం వల్ల నష్టం జరిగే అవకాశం కూడా ఉన్నట్లు మరి కొందరు స్పష్టం చేశారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లతో ముందుకు సాగుదామని ఇంకొందరు తమ అభిప్రాయాలను స్పష్టం చేసినట్లు తెలిసింది. మంత్రుల మధ్య డిఫరెంట్ ఓపినియన్లు రావడంతో తుది నిర్ణయానికి మరి కొంత సమయం పట్టే ఛాన్స్ ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Also Read; Mahabubnagar Rain: మహబూబ్ నగర్ జిల్లాలో అర్ధరాత్రి నుంచి దంచికొడుతున్న వర్షం
ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఒక సాంకేతిక చిక్కు ఎదురవుతోంది. ఒకవేళ ఇప్పుడే నోటిఫికేషన్ ఇచ్చి ప్రక్రియ పూర్తి చేయకపోతే ఆలస్యమయ్యే అవకాశం మే-జూన్ నెలల్లో ఎండలు, వడగాల్పుల తీవ్రత కారణంగా ఎన్నికలు నిర్వహించడం అసాధ్యమని ప్రభుత్వం భావిస్తుంది. అంతేగాక మార్చి నెలలో వరుసగా విద్యార్ధులకు ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. ఆ తర్వాత జూలైలో వర్షాలు మొదలవుతాయి. ఈ నేపథ్యంలో మార్చిలో నిర్వహించకపోతే మళ్లీ ఆగస్టు వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అధికారులు కేబినెట్కు వివరించినట్లు తెలుస్తోంది. ఈ గ్యాప్ లో రైతు భరోసాతో పాటు గ్రామ స్థాయిలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. దీంతో ప్రభుత్వానికి మరింత మైలేజ్ వస్తుందనే ఆశను సర్కార్ వ్యక్త పరుస్తుంది.
మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు కేవలం స్థానిక నాయకత్వానికి సంబంధించినవి మాత్రమే కావు. ఇవి భవిష్యత్తులో రాబోయే సాధారణ ఎన్నికలకు సెమీఫైనల్స్ లాంటివని కాంగ్రెస్ ఆలోచిస్తున్నది. ఈ నేపథ్యంలో బీసీ కులగణన నివేదిక రాకుండా, పెంచిన రిజర్వేషన్లు అమలు చేయకుండా ఎన్నికలకు వెళ్తే బీసీ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్నదని టెన్షన్ పడుతున్నారు. అంతేగాక రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో, నిధుల కేటాయింపులు,పథకాల అమలుపై ఫోకస్ పెట్టాల్సిన సమయంలో ఎన్నికల కోడ్ అడ్డురావచ్చని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్(BRS), బీజేపీ(BJP) వంటి పార్టీలు కూడా ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకతను సాకుగా చూపి పుంజుకోవాలని అవి భావిస్తుండగా, ఆ అవకాశం ఇవ్వకూడదని అధికార పార్టీ యోచిస్తోంది. కేబినెట్ భేటీలో వీటన్నింటిపై చర్చలు జరిగినప్పటికీ, తుది నిర్ణయాన్ని ముఖ్యమంత్రికి వదిలేసినట్లు సమాచారం.
Also Read: Telangana Cabinet: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రమాద బీమా పథకం అమలు