Telangana Cabinet: ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం.. భద్రతకు రాష్ట్ర మంత్రి వర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలోనే ఆదర్శవంతమైన కొత్త పథకాలు అమలు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన ఈరోజు జరిగిన మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి భద్రత, భరోసా కల్పించేందుకు రెండు కొత్త పథకాలను ప్రారంభిస్తుంది. మొదటిది.. ఉద్యోగుల ప్రమాద బీమా పధకాన్ని అమలు చేయనున్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్రంలో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు అందరికి, పెన్షనర్లకు ప్రమాద బీమా పధకం అమలు చేయనున్నది. ఉద్యోగులు ఒక్క రూపాయి ప్రీమియం కూడా చెల్లించకుండా ఈ పథకాన్ని అమలు చేస్తుంది.
మన ప్రభుత్వం తొలిసారిగా సింగరేణిలో, ట్రాన్స్ కోలో ఉద్యోగ వర్గాలకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. అక్కడ విజయవంతంగా అమలు చేసింది. దీంతో ఇప్పుడు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు అందరికి ఈ పథకాన్ని ప్రారంభిస్తుంది.ఈ ప్రమాద బీమా అమలుతో ఒకవేళ ఎవరైనా ప్రమాదం లో మరణిస్తే రూ.1.2 కోట్లు ప్రమాద బీమా పరిహారం అందుతుంది.అంతేగాక సహజ మరణానికి 60 ఏళ్ల వరకు ఉద్యోగులకు రూ.10 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రభుత్వ కార్పొరేషన్లు. ప్రభుత్వ రంగ సంస్థల పరిధిలో 5 లక్షల 19 వేల మంది రెగ్యులర్ ఉద్యోగులున్నారు. వీరితో పాటు 2 లక్షల 38 వేల మంది పెన్షనర్లు ఉన్నారు. మొత్తం 7.57 లక్షల మందికి ఈ ప్రమాద బీమా వర్తిస్తుంది.అటు ఉద్యోగులు, ఇటు ప్రభుత్వంపై ఎలాంటి భారం లేకుండా బ్యాంకర్ల ద్వారా బీమా అమలు చేయాలని రాష్ట్ర కేబినేట్ నిర్ణయించింది.
Also Read: Action Thriller OTT: భయంకరమైన కుట్రలు… బలయ్యేది డిఫెన్స్ ఆఫీసర్లు… ఊర మాస్ రివేంజ్ మావా
ఇక ఉద్యోగులకు రెండో శుభవార్త.. క్యాష్ లెస్ ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ ను అమలు చేయనున్నది. దీర్ఘకాలికంగా ప్రభుత్వ ఉద్యోగుల ఎదురుచూస్తున్న మరో కోరికను రాష్ట్ర కేబినెట్ సోమవారం నెరవేర్చింది. ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు క్యాష్ లెస్ ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ ఎస్ )అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది.3 లక్షల 56 వేల మంది ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులతో పాటు 2.88 లక్షల మంది పెన్షనర్లు, వారిపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులు మొత్తం 17.07 లక్షల మందికి ఈ పధకం వర్తిస్తుంది.ఇకపై ప్రభుత్వ ఉద్యోగులు ఆసుపత్రుల్లో ఒక్క రూపాయి చెల్లించకుండానే వైద్య చికిత్సలు అందుతాయి. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు 652 ఎంప్యానెల్ ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఈ పధకం వర్తిస్తుంది. దీనిపై మొత్తం 1998 వైద్య చికిత్సలు అందిస్తారు. ప్రతి ఉద్యోగికి డిజిటల్ హెల్త్ ఎంప్లాయీ కార్డ్ అందిస్తారు.
రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ఉచిత నాణ్యమైన వైద్యం అందించాలని కేబినెట్ నిర్ణయించింది.ఈ పధకానికి ప్రభుత్వ ఉద్యోగులు తమ బేసిక్ పే నుంచి 1.5 శాతం తమ వాటాగా చెల్లిస్తారు. అంతే సమాన వాటాను ప్రభుత్వం మ్యాచింగ్ వాటా చెల్లిస్తుంది.ఏడాదికి ఉద్యోగులు రూ. 528 కోట్లు తమ వాటాగా చెల్లిస్తే.. ప్రభుత్వం కూడా రూ. 528 కోట్లు వాటా చెల్లిస్తుంది. మొత్తం రూ.1056 కోట్ల తో క్యాష్ లెస్ ఎంప్లాయి హెల్త్ స్కీమ్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉంటుంది. ఉద్యోగుల ఆరోగ్యం, సంక్షేమం. కుటుంబ భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రజా ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి స్థాయిలో భరోసా, నమ్మకం కల్పిస్తుందనడానికి ఈ పధకాలు నిదర్శనమని కేబినెట్ మొత్తం హర్షం వ్యక్తం చేసింది.
Also Read: Bandi Sanjay: ప్రజా సమస్యలు పట్టవా అంటూ.. సీఎం పై బండి సంజయ్ గరం గరం