Mahabubnagar Rain: స్వేచ్ఛ బ్యూరో: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. మరికొన్ని చోట్ల తెల్లవారుజాము వరకు ముసురు పట్టి ఎడతెరిపి లేకుండా చినుకులు రాలుతూనే ఉన్నాయి. జిల్లాకు వర్ష సూచన లేదని ధీమాగా ఉన్న రైతన్నకు అకస్మాత్తుగా కురిసిన ఈ వర్షం రైతుల పాలిట శాపంగా మారింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు కళ్లాల్లో ఉండగా వర్షానికి ధాన్యం తడవడంతో అన్నదాతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఉమ్మడి మహబూబ్ నగర్ , నల్గొండ జిల్లాల్లో వర్ష ప్రభావం కొనసాగనుంది. ముఖ్యంగా నల్గొండ, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరికలు జారీ అయ్యాయి.
Also Read: MP DK Aruna: దమ్ముంటే కామారెడ్డి చౌరస్తాకు రండి.. ఎంపీ డీకే అరుణ సవాల్..?
హైదరాబాద్ నగరంలో కూడా తెల్లవారుజామున 3:00 నుంచి 4:00 గంటల మధ్య మోస్తరు వర్షం కురిసింది. ప్రస్తుతం నగరంలో వాతావరణం పొడిగానే ఉన్నప్పటికీ, మధ్యాహ్నం తర్వాత మళ్లీ ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని సమాచారం.
ప్రస్తుతం పంటలు కోత దశకు చేరుకున్న సమయంలో కురిసిన ఈ వర్షానికి వరి, మిర్చి, శనగ, వేరుశనగ, పొగాకు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అందుబాటులో ఉన్న టార్ఫాలిన్ లతో ధాన్యాల మీద కప్పే ప్రయత్నం చేశారు.ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దవ్వడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం కూడా వర్షపు నీటిలో నానడంతో నాణ్యత దెబ్బతినే అవకాశం ఉందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పంట నష్టాన్ని అంచనా వేసి తమను ఆదుకోవాలని రైతాంగం వేడుకుంటోంది.
Also Read: Telangana Cabinet: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రమాద బీమా పథకం అమలు