Cabinet Sub Committer to visit Utnoor: రైతుభరోసా పథకానికి సంబంధించి విధివిధానాలను రూపకల్పన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతున్న విషయం తెలిసిందే. ఇందుకోసం మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించింది. ఈ ఉప సంఘం రైతు భరోసా పథకం విధి విధానాలను రూపొందిస్తున్నది. అందులో భాగంగా రైతులు, ప్రజాప్రతినిధులును, నిపుణుల సూచనలు తీసుకుంటున్నది. ఇందుకోసం ఉమ్మడి జిల్లాల వారీగా ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల వారీగా ఉపసంఘం పర్యటించనున్నది. రేపు ఉట్నూర్ కు వెళ్లనున్నది. రైతు భరోసా పథకంపై రైతుల అభప్రాయ సేకరణ, వర్క్ షాప్ నకు రైతు భరోసా కమిటీ సభ్యులైన మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీతక్కలు.. ఉట్వూరు కేబీ కాంప్లెక్స్ కు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా హెలిప్యాడ్, మీటింగ్ హాల్ లను స్థానిక ఎమ్మెల్యే వెడ్మా బొజ్జుతో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
కలెక్టర్ మాట్లాడుతూ.. రైతు భరోసా పథకంపై అభిప్రాయాల సేకరణకు గురువారం ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా స్థాయిలో వర్క్ షాప్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉట్నూర్ కేబీ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన వర్క్ షాపు ఉదయం 10.30 గంటల నుంచి మ. 2 గంటల వరకు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. రైతులు, ప్రజాప్రతినిధులు, అన్ని వర్గాల వారు వర్క్ షాప్ లో పాల్గొనడం జరుగుతుందని, రైతు భరోసా పథకంపై అభిప్రాయాలు, సూచనలు సేకరిస్తారని ఆయన చెప్పారు.
ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు మాట్లాడుతూ.. రైతు భరోసా పథంపై అభిప్రాయాలను తెలియజేసేందుకు ప్రభుత్వం ఒక మంచి అవకాశాన్ని కల్పించిందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Also Read: రైతుల పక్షాన ఆలోచించాలి.. వారితో నేరుగా కలెక్టర్లే మాట్లాడాలి
ఇదిలా ఉంటే.. ఖమ్మం కలెక్టరేట్ లో నిర్వహించిన రైతు భరోసా పథకం ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొని మాట్లాడారు. రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా అందజేస్తామని గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. ఆ హామీని అమలు చేయడం కోసం తమ ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందన్నారు.
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టినందున రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టినట్లు ఆయన చెప్పారు. త్వరలోనే పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెడుతామన్నారు. రైతు భరోసా పథకం అమలు కోసం ఉమ్మడి పది జిల్లాల్లో పర్యటించి ప్రజలు, రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించి విధివిధానాలు రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.