CAG Report: కాళేశ్వరం.. తానే అపర భగీరథుడనంటూ మాజీ సీఎం కేసీఆర్ గర్వంగా రొమ్ము విరుచుకొని చెప్పుకున్నారు. కానీ అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిందే కమీషన్ల కోసమని కాగ్ రిపోర్ట్ తేల్చేసింది. అడుగడుగునా అంచనాలు పెంచడం.. అందినకాడికి దోచుకోవడం.. ఇదే పద్ధతిలో సాగింది కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం. ఒక్క మాటలో చెప్పాలంటే కాళేశ్వరంలో అడ్డగోలుతనాన్ని బయటపెట్టింది కాగ్ రిపోర్ట్. మేఘా ఇంజనీరింగ్, ఎల్అండ్టీ, నవయుగ కంపెనీలకు భారీగా ముట్ట చెప్పినట్టు కాగ్ రివ్యూలో తేలిపోయింది. ఈ మూడు కంపెనీలకు దాదాపు 7 వేల 500 కోట్ల లబ్ధి చేకూర్చారని కాగ్ తెలిపింది.
ఈ ప్రాజెక్ట్ విలువ కేవలం 80 వేల కోట్లు మాత్రమే అంటూ ఇన్నాళ్లు బాకా ఊదుతున్న బీఆర్ఎస్కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది కాగ్. ఈ ప్రాజెక్ట్ విలుల అక్షరాల లక్షా 51 వేల కోట్లకు పైనే అని తేల్చేసింది. నిజానికి DPRలో కాళేశ్వరం ప్రాజెక్ట్ వ్యయం 63 వేల 352 కోట్లుగా చెప్పిన కేసీఆర్ సర్కార్.. CWCకి ఇచ్చిన నివేదికలో మాత్రమే 81 వేల 911 కోట్లకు పెంచింది. 2022లో జరుగుతున్న పనుల ప్రకారమే లక్ష కోట్లకు అంచనాలు పెరగగా.. ప్రాజెక్ట్ పూర్తయ్యే సరికి కాళేశ్వరం ఖర్చు అక్షరాల లక్ష 49వేల కోట్లకు చేరడం ఖాయమని తేల్చేసింది కాగ్.
ముఖ్యంగా మేఘా ఇంజనీరింగ్ కంపెనీకి వేల కోట్లు దోచిపెట్టారని కాగ్ గుర్తించింది. ఇవ్వాల్సిన దాని కంటే ఏకంగా 5 వేల 188 కోట్ల అదనపు చెల్లింపులు చేసింది బీఆర్ఎస్ సర్కార్. ఇదంతా కేవలం నాలుగు ప్యాకేజీల పనుల్లోనే తేలిన లెక్కలు. మరో 17 ప్యాకేజీల చెల్లింపుల లెక్కలు తేలాల్సి ఉంది. 2022లో కాగ్కు 13 ప్యాకేజీల ఇన్వాయిస్లు ఇవ్వలేదు బీఆర్ఎస్ సర్కార్. అవి కూడా ఇచ్చి ఉంటే బీఆర్ఎస్ కమీషన్ కహానీపై మరింత క్లారిటీ వచ్చేది. కమీషన్ల కోసమే కాళేశ్వరం నిర్మించారని కాంగ్రెస్ ఎప్పటి నుంచో ఆరోపిస్తూ వస్తోంది. ఇప్పుడీ ఆరోపణలకు బలం చేకూర్చేలా ఉంది కాగ్ నివేదిక. అంతేకాదు చేయాల్సిన పనులు తగ్గినా.. ప్రాజెక్ట్ అంచనాలు, చెల్లింపులు ఏ మాత్రం తగ్గకపోవడం ఇక్కడ విశేషమనే చెప్పాలి. పంప్లు, మోటార్ల కొనుగోళ్లలో అంచనాలు అమాంతం పెరగడంపై అనేక సందేహాలు ఉన్నాయి. బీహెచ్ఈఎల్కు పంపులకు కాంట్రాక్టర్ చెల్లించింది కేవలం 1686 కోట్లు కాగా.. కాంట్రాక్టర్ మాత్రం ప్రభుత్వం నుంచి 7 వేల 217 కోట్లు వసూలు చేశారు. ఒక్క మోటర్ల సరఫరాలోనే 5 వేల 188.43 కోట్లు దోచేసింది కాంట్రాక్ట్ సంస్థ. ప్రైస్ అడ్జెస్ట్మెంట్లో కూడా 1343 కోట్ల లబ్ధి పొందారని కాగ్ గుర్తించింది.
అంతేకాదు దోపిడి ఏ విధంగా సాగిందో కూడా కాగ్ తన రిపోర్ట్లో తెలిపింది. ప్యాకేజ్ 18 పనుల్లో ప్రభుత్వం టన్నెల్ పొడవును తగ్గించింది. పొడవు తగ్గినప్పుడు ఆటోమెటిక్గా నిర్మాణ వ్యయం కూడా తగ్గుతుంది. కానీ అలా జరగలేదు. ముందుగా అంచనా వ్యయానికి తగ్గట్టుగానే చెల్లింపులు చేసింది. దీంతో కాంట్రాక్ట్ సంస్థకు 94.32 కోట్లు లబ్ధి చేకూరింది. ప్యాకేజ్ 17 పనుల్లో కూడా 50 కోట్ల అదనపు చెల్లింపులు జరిగాయి. ప్యాకేజ్ 9 పనుల్లో 48 కోట్ల అదనపు చెల్లింపులు జరిగాయి. ఇక ప్యాకేజ్ 21ఏ పనుల్లో కాంట్రాక్ట్ సంస్థకు 21 కోట్లు చెల్లించింది ప్రభుత్వం. కాళేశ్వరం నిర్మాణం కోసం ఏకంగా 87వేల కోట్లకుపైగా అప్పు చేసింది బీఆర్ఎస్ సర్కార్. 2022 వరకు 55 వేల 807 కోట్లు తీసుకుంది. ఇందుకోసం 7.8 నుంచి 10.9 శాతం ఇంట్రెస్ట్ రేట్తో రుణాలు తీసుకుంది. కానీ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉండగానే ఏకంగా 19 వేల 556 కోట్ల వడ్డీ చెల్లించింది. పోనీ పూర్తిగా చెల్లించిందా అంటే అదీ లేదు. సరైన సమయంలో లోన్లను చెల్లించకపోవడంతో అదనపు వడ్డీ భారం పడింది. మార్చి, 2022 వరకు పడిన అదనపు వడ్డీ భారం ఏకంగా 8 వేల కోట్లకపైనే ఉన్నట్టు కాగ్ తేల్చింది.
.
.