భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం వాస్తవాలను పక్కదారి పట్టించేలా హరీష్ రావు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతోనే హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. సిట్ విచారణలో ఉన్న అసలు అంశాలను పక్కదారి పట్టించేందుకు హరీష్ రావు ‘ట్రిక్స్’ ప్లే చేస్తున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు.
ముఖ్యంగా సృజన్ రెడ్డికి సింగరేణి కాంట్రాక్టులు కట్టబెట్టారన్న ఆరోపణలపై చామల ఘాటుగా స్పందించారు. సృజన్ రెడ్డి ఎవరో కాదు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికి స్వయానా అల్లుడని ఆయన గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి తనకు సృజన్ రెడ్డి దూరపు చుట్టమని ఇప్పటికే స్పష్టం చేశారని, తన అల్లుడిని ఎందుకు బద్నాం చేస్తున్నారని గతంలోనే కందాల ఉపేందర్ రెడ్డి ప్రశ్నించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. బీఆర్ఎస్ హయాంలోనే సృజన్ రెడ్డితో పాటు ప్రతిమ శ్రీనివాసరావు, హర్ష, సుధాకర్ రెడ్డి వంటి వారికి కాంట్రాక్టులు ఇచ్చారని, కేటీఆర్, హరీష్ రావు బంధువులకే అప్పట్లో సింగరేణి పనులు దక్కాయని చామల ఆరోపించారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మాట్లాడుతూ.. ‘సొంత ఇంటి అల్లుడి ఫోన్ ట్యాప్ చేశారని కవిత స్వయంగా చెప్పారు. మీ కుటుంబ సభ్యులే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెబుతుంటే, ఇప్పుడు విచారణను ఎందుకు అడ్డుకుంటున్నారు?’ అని ప్రశ్నించారు. సింగరేణి, హిల్ట్, టి.డి.ఆర్ కుంభకోణాలంటూ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని, హిల్ట్ పాలసీపై ప్రభుత్వం కేవలం చర్చ మాత్రమే చేసిందని, అందులో రూపాయి అవినీతి కూడా జరగలేదని స్పష్టం చేశారు.
దమ్ముంటే 2014 నుంచి 2026 వరకు సింగరేణిలో జరిగిన పరిణామాలపై విచారణ జరిపించాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి కేటీఆర్, హరీష్ రావు లేఖ రాయాలని చవాల్ విసిరారు. కిషన్ రెడ్డితో వారికి ఉన్న సత్సంబంధాలను వాడుకుని విచారణ కోరాలని, ఎంపీగా తాను కూడా లేఖ రాస్తానని పేర్కొన్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ అవినీతి, అధికార దుర్వినియోగం బయటపడుతుంటే తట్టుకోలేకనే హరీష్ రావు, కేటీఆర్ హడావుడి చేస్తున్నారని చామల కిరణ్ రెడ్డి ఎద్దేవా చేశారు.