Chamala Kiran Kumar Reddy: బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ చేస్తున్న విమర్శలపై భువనగిరి లోక్ సభ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. చట్టాల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అలాగే డీజీపీ శివధర్ రెడ్డికి కేటీఆర్ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని ఆయన మండిపడ్డారు. రెడ్ బుక్ ఖాకీ బుక్ అంటూ కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలను ఎంపీ కొట్టిపారేశారు. ఖాకీ బుక్ అనేది ఎప్పటికీ ఉంటుందని శాంతి భద్రతల పరిరక్షణలో దాని పాత్ర కీలకమని గుర్తు చేశారు. గత పదేళ్ల పాలనలో పోలీసులు ఏ విధంగా వాడుకున్నారో ప్రజలందరికీ తెలుసని.. చివరకు సొంత చెల్లి కవిత కూడా అల్లుడి ఫోన్ ట్యాప్ చేశారని చెప్పిన విషయాన్ని చామల గుర్తు చేశారు.
అధికారంలోకి వస్తామనే భ్రమల నుంచి కేటీఆర్ బయటకు రావాలని చామల సూచించారు. పింక్ బుక్ రెడ్ బుక్ వంటి ఆలోచనలు మానుకోవాలని హితవు పలికారు. కేటీఆర్ హయాంలో చట్టాన్ని చుట్టంలా మార్చుకున్నారని.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజ్యాంగం ప్రకారం చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. పదేళ్ల అరాచక పాలనను చూసే ప్రజలు బీఆర్ఎస్ పార్టీని శాశ్వతంగా ఇంటికి పంపించారని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం పోలీసులను ఎప్పుడూ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోదని.. కేవలం చట్ట పరిరక్షణకే ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడించారు.
రాజ్యాంగంపై కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ గౌరవం ఉందని ఎంపీ చామల వివరించారు. కేటీఆర్ తన హయాంలో జరిగిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే ప్రస్తుత ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు చేస్తున్న బెదిరింపులకు కాంగ్రెస్ కార్యకర్తలు భయపడబోరని చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా కేవలం ప్రతీకార రాజకీయాలు మాట్లాడితే ప్రజలు మరింత బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ప్రభుత్వ యంత్రాంగం నిష్పక్షపాతంగా పని చేస్తోందని.. తప్పు చేసిన వారు ఎవరైనా చట్టం ముందు సమాధానం చెప్పాల్సిందేనని చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
Read Also: KTR: రెండేళ్లలోమళ్లీ కేసీఆరే సీఎం.. గులాబీ జెండా ఎగరడం ఖాయం, కేటీఆర్ కీలక వ్యాఖ్యలు