Chamala Kiran Kumar Reddy: ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సిట్ విచారణ ఎదుర్కొన్న అనంతరం భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. 2023 జులైలో తన ఫోన్ ట్యాప్ అయినట్లు అధికారులు చెప్పారని చామల అన్నారు. తాను ఆ సమయంలో టీపీసీసీ మీడియా కమిటీ ఛైర్మన్ గా వ్యవహరించినట్లు గుర్తుచేశారు. అప్పటి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి తాను సన్నిహితంగా ఉండటంతో తన ఫోన్ ను ట్యాప్ చేశారని ఎంపీ చామల తెలిపారు. హార్డ్ డిస్క్ ఆధారంగా తన ఫోన్ ట్యాప్ అయిన విషయం బయటపడిందని పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి టీమ్ లో అప్పట్లో సభ్యుడిగా ఉండటం వల్లే తన ఫోన్ ట్యాప్ చేశారని చామల చెప్పుకొచ్చారు. తమ అధికారాన్ని తిరిగి నిలబెట్టుకునేందుకు గత ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ నేతల ఫోన్లు ట్యాప్ చేసిందని చామల ఆరోపించారు. చివరికి ఇంట్లోని వాళ్ల ఫోన్లు కూడా చాటుగా విన్నారని విమర్శించారు. చివరికీ హరీశ్ రావు ఫోన్ ను సైతం ట్యాప్ చేశారని.. దెబ్బకు ఆయన తన డ్రైవర్, పీఏను మార్చుకున్నారని ఆరోపించారు. కవిత కూడా తన ఫోన్ ట్యాప్ అయిన విషయాన్ని గతంలోనే ప్రస్తావించారని చామల గుర్తు చేశారు.
అధికారాన్ని దుర్వినియోగం చేయడంలో కేసీఆర్ ను మించిన వారు లేరని ఎంపీ చామల విమర్శించారు. సొంత కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేసినప్పుడు.. రేవంత్ రెడ్డి, ఈటెల రాజేందర్, బండి సంజయ్, చామల కిరణ్ కుమార్ రెడ్డి ఒక లెక్కనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో స్వేచ్ఛ లేకుండా చేశారని దుయ్యబట్టారు. కేసీఆర్ అన్ని వ్యవస్థలను వాడుకుని ఎప్పటికీ అధికారంలో తానే ఉండాలని అనుకున్నారని పేర్కొన్నారు. అధికారం పోయే సరికి ఫామ్ హౌస్ కు పరిమితం అయ్యారని ఎద్దేవా చేశారు.
Also Read: ఏ బ్యాక్గ్రౌండ్ లేదు.. పోలీసు బిడ్డగా సీఎం స్థాయికి చేరా.. సీఎం రేవంత్ భావోద్వేగం
తండ్రి ఫామ్ హౌస్ నుంచి బయటకు రాకపోవడంతో.. ఇప్పుడు కేటీఆర్ రోడ్డెక్కారని ఎంపీ చామల సెటైర్లు వేశారు. విచారణ సందర్భంగా సిట్ అధికారులు తనకు చెప్పింది వింటే ఆశ్చర్యం కలుగక మానదని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేల ఫోన్లు ట్యాప్ చేసిందని.. వ్యక్తిగత సంభాషణలు చాటుగా విన్నదని చామల అన్నారు. ఫోన్ ట్యాప్ కు గురైన వారిలో వ్యాపారవేత్తలు, మీడియా అధినేతలు, సినిమావాళ్లు ఉన్నారని తెలిపారు. ఇకనైనా బీఆర్ఎస్ నేతలు.. నీతులు చెప్పడం మానుకోవాలని హితవు పలికారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను గత పదేళ్లలో బీఆర్ఎస్ అప్పుల పాలు చేసిందని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ చేసిన వారికి కచ్చితంగా శిక్ష పడాలని తాను కోరుకుంటున్నట్లు ఎంపీ చామల చెప్పుకొచ్చారు.
Also Read: ఆండ్రాయిడ్ ఫోన్లను.. ఘోరంగా అవమానించిన యాపిల్.. నెట్టింట రచ్చ రచ్చ!