Chamala Kiran: భువనగిరి లోక్సభ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీ వైఖరిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటీవల బిఆర్ఎస్ నిర్వహించిన మాక్ అసెంబ్లీ ఒక ప్రహసనమని, అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలపై నిలదీసే ధైర్యం లేకే ఇటువంటి నాటకాలకు తెరతీశారని విమర్శించారు. శాసనసభా పక్ష సమావేశంలోనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు గొడవలు సృష్టించాలని కేసీఆర్ దిశానిర్దేశం చేసి పంపారన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆయనకు గానీ, ఆ పార్టీ ఎమ్మెల్యేలకు గానీ సభకు వచ్చి మాట్లాడే నైతిక హక్కు లేదని ఎంపీ చామల స్పష్టం చేశారు.
అసెంబ్లీ గేట్ల వద్ద అనవసర రాద్ధాంతం
చట్టసభలో చర్చకు రాకుండా బిఆర్ఎస్ నేతలు ఉద్దేశపూర్వకంగానే డ్రామాలు ఆడారని ఎంపీ మండిపడ్డారు. నల్ల టీషర్టులపై పేర్లు రాసుకుని వస్తే భద్రతా సిబ్బంది లోపలికి అనుమతించరని ముందే ఊహించి, అసెంబ్లీ గేటు వద్ద పోలీసులతో గొడవకు దిగారని తెలిపారు. సభ లోపలికి వచ్చి ప్రజా సమస్యలపై ప్రశ్నించే అవకాశం ఉన్నప్పటికీ.. ఉద్దేశపూర్వకంగా బయటే ఆందోళన చేస్తూ సమయాన్ని వృథా చేశారని విమర్శించారు. ఈ క్రమంలో బిఆర్ఎస్ నేతలు దళితులను, గౌరవ స్పీకర్ పదవిని అవమానించేలా ప్రవర్తించడం వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు.
మాక్ అసెంబ్లీలో వెకిలి చేష్టలు
సభకు ప్రత్యామ్నాయంగా నిర్వహించిన మాక్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతలు ప్రవర్తించిన తీరుపై చామల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిని, మంత్రులను వ్యక్తిగతంగా దూషిస్తూ, వెకిలి చేష్టలతో కాలయాపన చేశారని అన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించే ఆలోచన బిఆర్ఎస్ నాయకులకు ఏమాత్రం లేదని, అందుకే వారు సురభి నాటక మండలిలో చేరడానికి సరైన అభ్యర్థులని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఉపయోగపడే పనులు విడిచిపెట్టి, ప్రజాస్వామ్య వ్యవస్థలను ఎగతాళి చేయడం వారికి అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు.
రాబోయే పండుగల్లో నాటకాలకు బిఆర్ఎస్ నేతలే సరి
రాష్ట్ర ప్రజలు బిఆర్ఎస్ నాయకులను జోకర్లుగా చూస్తున్నారని ఎంపీ ఘాటుగా వ్యాఖ్యానించారు. రాబోయే వినాయక చవితి, దసరా, దీపావళి ఉత్సవాల్లో నాటకాలు, రికార్డింగ్ డ్యాన్సుల ప్రదర్శనలకు ఈ ఎమ్మెల్యేలే సరిపోతారని చమత్కరించారు. దసరా పండుగ వేళ వీరి నాటకాల అవసరం ఎంతో ఉందన్న ఆయన, రాబోయే సంక్రాంతి పండుగ సమయానికి నాటకాలు వేసుకోవడానికి వీరిని ఆంధ్రప్రదేశ్కు పంపిస్తామంటూ ఎద్దేవా చేశారు. ప్రజా క్షేమాన్ని విస్మరించి చిల్లర రాజకీయాలు చేస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఎంపీ చామల హెచ్చరించారు.
Also Read: అమీర్పేట్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ర్యాపిడో బైక్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, మహిళ దుర్మరణం!