MV Soundara Rajan: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం, వీసా బాలాజీగా ప్రసిద్ధి చెందిన చిలుకూరు బాలాజీ ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త డాక్టర్ ఎం.వి. సౌందర రాజన్ (86) కన్నుమూశారు. గత కొంతకాలంగా వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి వార్త తెలిసిన వెంటనే చిలుకూరు ఆలయ పరిసరాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆలయ అర్చకులు, భక్తులు పెద్ద ఎత్తున ఆయన నివాసానికి చేరుకుని నివాళులర్పిస్తున్నారు.
సౌందర రాజన్ కేవలం ఆలయ వ్యవస్థాపకుడిగానే కాకుండా.. చిలుకూరు బాలాజీ క్షేత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్గా పనిచేసిన ఆయన.. పదవీ విరమణ అనంతరం పూర్తి సమయాన్ని ఆధ్యాత్మిక సేవకే అంకితం చేశారు. ఆలయంలో హుండీ లేని వ్యవస్థను, వీఐపీ దర్శనాలు లేని సంప్రదాయాన్ని తీసుకురావడంలో ఆయన కృషి చిరస్మరణీయం. సామాన్య భక్తులకు.. ఉన్నత వర్గాలకు మధ్య వ్యత్యాసం ఉండకూడదని ఆయన ఎప్పుడూ ఆకాంక్షించేవారు.
ఆయన పర్యవేక్షణలోనే చిలుకూరు ఆలయం అత్యంత పవిత్రమైన.. నిరాడంబరమైన క్షేత్రంగా విరాజిల్లింది. భక్తులు 108 ప్రదక్షిణలు చేసే సంప్రదాయాన్ని ఆయన ఎంతో ప్రోత్సహించారు. సౌందర రాజన్ మృతి పట్ల పలువురు ప్రముఖులు.. ఆధ్యాత్మిక గురువులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం ఆధ్యాత్మిక రంగానికి.. ముఖ్యంగా చిలుకూరు ఆలయ కుటుంబానికి తీరని లోటని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన అంత్యక్రియలు కుటుంబ సభ్యుల సమక్షంలో వైష్ణవ సంప్రదాయం ప్రకారం జరగనున్నాయి.
Read Also: Vemulawada: పాపం.. కదిలిస్తే కన్నీళ్లే, వేములవాడలో యాచకులుగా మారిన ఎడ్యుకేటెడ్ కపుల్స్