కదిలిస్తే కన్నీళ్లే… అందరూ ఉన్న అనాథాల్లాగా మిగిలారు.. ఉన్నత చదువులు చదువుకున్నారు. వారి చదువుకు ప్రైవేట్ కంపెనీల్లో ఏదో ఒక జాబ్ దొరుకుతుంది.. అయినా వాళ్లు ఉద్యోగం చేయడానికి ఇష్ట పడలేదు.. బిక్షాటన చేయడానికి సిద్ధపడ్డారు.. వేములవాడ రాజన్న ఆలయ పరిసరాల్లో నిత్యం యాచిస్తున్నారు ఆ వృద్ధ దంపతులు.. ఇదంతా గమనించిన అధికారులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు.. ఈ కౌన్సిలింగ్ లో ఓ అరుదైన కుటుంబ కథ అందరిని కలచివేసింది.. భర్త ఎల్ఎల్డీ పూర్తి చేయగా భార్య బీకాం కంప్యూటర్స్ పూర్తి చేసి రాజన్న సన్నిధిలో యాచిస్తూ వెళ్లదీస్తున్నారు..
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, భీమేశ్వర స్వామి ఆలయం, బద్ది పోచమ్మ ఆలయ పరిసరాల్లో సుమారు 100 మందికిపైగా భిక్షాటన చేస్తున్నారు. అయితే ఇందులోని కొందరి వృద్ధుల దీనగాధ కంటతడి పెట్టిస్తోంది. కొడుకు కూతుర్లు కుటుంబాలు ఉన్న పట్టించుకోని కారణంతో రాజన్న ఆలయ పరిసరాలకు వచ్చి యాచిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యుల నుంచి ఎదురైన అనుభవాలను వారు అధికారుల ముందు పెట్టి బోరున విలపించారు. కొందరు యాచక వృత్తినే ఆసరాగా చేసుకుని డబ్బులు సంపాదిస్తుండగా మరికొందరు కుటుంబాల బాధలను వెలగక్కారు.
అయితే.. ఇక్కడ కరీంనగర్ చెందిన జలంధర్ రెడ్డి, శిరీష దంపతులు ఉన్నత విద్యను అభ్యసించారు. జలంధర్ రెడ్డి ఎల్ఎల్బీ పూర్తి పూర్తి చేయగా శిరీష బీకాం కంప్యూటర్స్ పూర్తి చేశారని అధికారుల కౌన్సిలింగ్ లో తేలింది. ఇంగ్లీషులో మాట్లాడుతున్న విధానం చూసి అధికారులు ఒక్కసారి అవాక్కయ్యారు. అయితే తన భార్య ఆరోగ్యం సరిగా లేకపోవడంతో రాజన్న సన్నిధికి వచ్చి ఇక్కడే ఉంటున్నామని తెలిపారు. కాలం మారుతున్న కొద్దీ భార్యని భర్త చంపడం … భర్త ను భార్య చంపడం ఈ కాలంలో ఎక్కువగా చూస్తున్నాం మనం … కానీ ఈ జంటను చూసి నేర్చుకోవాల్సిన నీతి ఎంతో ఉంది.. భార్య బాగు కోసం రాజన్న చెంతకు వచ్చి ఇక్కడే దొరికిన పని చేస్తూ.. జీవితం గడుపుతున్న తీరు అందరిని ఒక్కసారిగా కంటతడి పెట్టించింది.
ఇలా ఎందరో కష్టం చేసే శక్తి లేక రాజన్న సన్నిధికి వచ్చినవారు, ఇంటికాడ కొడుకు కొట్టి చంపుతాడనే భయంతో వచ్చిన వాళ్లను ఎములాడ రాజన్న నే సాదుకున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్బంగా అదనపు ఎస్పీ చంద్రయ్య మాట్లాడుతూ.. ఇంటి నుండి ఏదైనా సమస్య ఉండి బయటకు వచ్చినవారు ఇంటికి వెళ్లేందుకు చట్టపరమైన సహాయం అందిస్తామని అన్నారు. వృద్ధులను వేధిస్తే సంబంధిత బంధువులపై కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు. అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని , కానీ వేములవాడ రాజన్న ఆలయ పరిసరాలు ఎవరు కూడా యాచించరాదని తెలిపారు.
ALSO READ: Vizianagaram Students Struggle: గోతుల్లో దిగి.. అడవుల్లో నడిచి.. పవన్ కళ్యాణ్కు విద్యార్థుల విన్నపం