Land Dispute: స్వేచ్ఛ బ్యూరో: సిద్దిపేట జిల్లా అక్బర్పేట–భూంపల్లి మండలం చౌదరిపల్లి గ్రామంలో వివాదాస్పదంగా మారిన సర్వే నంబర్ 294/4, 294/5 భూముల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఏడాది క్రితం నాటి జిల్లా కలెక్టర్ మనుచౌదరి ప్రత్యేకంగా నలుగురు సభ్యులతో రెవెన్యూ కమిటీ ఏర్పాటు చేసి సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ణయం వెలువడకపోవడం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. భూములపై వస్తున్న ఆరోపణలు, రైతుల ఫిర్యాదులు, కోర్టు పరిణామాల నేపథ్యంలో జిల్లా రెవెన్యూ అధికారి, సిద్దిపేట ఆర్డీవో, లాండ్ రికార్డ్స్ సర్వే శాఖ ఏడీ, అక్బర్పేట–భూంపల్లి తహసీల్దార్తో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ పూర్తి స్థాయి విచారణ చేసి నివేదిక సమర్పించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని అప్పట్లో ఉత్తర్వులు జారీ చేశారు. అదే సమయంలో గతంలో ఇచ్చిన బీ1/2479/2024 ఉత్తర్వులను నిలుపుదల చేశారు.
చౌదరిపల్లి గ్రామ సర్వే నంబర్ 294లోని కొంత భూమిపై వివాదం నెలకొనడంతో 19 మంది రైతులు న్యాయపోరాటానికి దిగారు. 294/4, 294/5 సర్వే నంబర్ల పరిధిలో సబ్ నంబర్లతో ఉన్న దాదాపు 12 ఎకరాల 15 గుంటల భూమిపై గత ఏడాది సెప్టెంబర్ 13న హైకోర్టును ఆశ్రయించారు. వారి వాదనలు విన్న హైకోర్టు సంబంధిత భూములపై పూర్తి విచారణ జరిపి తగిన నిర్ణయం తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు ఆదేశాలు ఇచ్చింది. అనంతరం స్థానిక తహసీల్దార్, ఆర్డీవో నివేదికల ఆధారంగా 1953 నుంచే అవి పట్టా భూములేనని పేర్కొంటూ ఈ ఏడాది ఏప్రిల్ 21న ఉత్తర్వులు జారీ చేశారు. అయితే అనంతరం వల్లపు బక్కయ్యతో పాటు మరికొందరు రైతులు తమ భూములను ఎవరికీ విక్రయించలేదని, ఎలాంటి బదిలీలు జరగలేదని, పట్టా నమోదులో లోపాలు సరిచేసి పట్టాదారు పాస్పుస్తకాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో మరోసారి సమగ్ర విచారణ అవసరమని భావించిన కలెక్టర్ కమిటీ ఏర్పాటు చేసినట్లు అప్పట్లో ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని చౌదరిపల్లి గ్రామంలో సర్వే నంబర్ 294లో మొత్తం 178.05 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి 294/1 నుంచి 294/10 వరకు విభజించబడింది. రెవెన్యూ రికార్డులు అయిన సేత్వార్, కాస్రా పహాణీల ప్రకారం ఈ భూమి మొత్తం ప్రభుత్వ భూమిగా నమోదై ఉండగా, ప్రస్తుతం 294/1 నుంచి 294/3 వరకు ఉన్న సుమారు 51 ఎకరాలు ప్రభుత్వ భూమిగానే కొనసాగుతున్నాయి. అయితే 294/4 నుంచి 294/10 వరకు ఉన్న భూములు ప్రైవేటు పట్టాలకు మారినట్లు రికార్డులు సూచిస్తున్నాయి.
ఈ భూముల్లో గ్రామానికి చెందిన కుమ్మరి, వడ్డెర సామాజిక వర్గాలకు చెందిన రైతులు చాలాకాలంగా సాగు చేస్తున్నట్లు తెలుస్తోంది. రైతుల వాదన ప్రకారం ఇవి తమ తాతల కాలం నుంచి వస్తున్న అసైన్డ్ భూములని చెబుతున్నారు. అసైన్డ్ భూములను చట్టపరంగా విక్రయించరాదు. విక్రయం జరిగితే పీవోటీ చట్టం ప్రకారం ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుంది.
Also Read: కర్ణాటకలో కాంగ్రెస్ కుర్చీ పంచాయితీ.. సీఎం సీటు కోసం కుమ్ములాటలు!
ఈ వివాదాస్పద భూముల్లో సుమారు 74 ఎకరాల వరకు కొంతమంది ప్రముఖ వ్యక్తులు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముందుగా రైతుల నుంచి లీజు పేరుతో భూములు తీసుకుని, తర్వాత పట్టా మార్పిడి చేసి ఇతరులకు విక్రయించారనే ఆరోపణలు రైతులు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్, స్థానిక రెవెన్యూ అధికారులకు రైతులు ఫిర్యాదులు చేయడంతో విచారణ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే కమిటీ ఏర్పాటు చేసి ఏడాది గడుస్తున్నా నివేదిక వెలుగులోకి రాకపోవడంతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కమిటీ ఏర్పాటు చేసి విచారణ ప్రారంభిస్తామని చెప్పి ఏడాది గడిచినా ఫలితం ఎందుకు లేదు..? పేద రైతులకు ఒకలా, ప్రభావశీలులకు మరోలా న్యాయం జరుగుతోందా..? అంటూ బాధిత రైతులు ప్రశ్నిస్తున్నారు. కమిటీ నివేదికను బహిర్గతం చేసి భూములపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Also read: నిజం మాట్లాడితే డ్యూటీ బంద్ చేస్తారా? పద్మదేవేందర్ రెడ్డి!