CM Revanth: రాజకీయాల్లో ఏనాడూ పదవుల కోసం రోశయ్య ప్రాకులాడలేదన్నారు సీఎం రేవంత్రెడ్డి. ఆయన క్రమశిక్షణ, ప్రతిభ హోదాలను తెచ్చిపెట్టాయన్నారు. మాజీ సీఎం రోశయ్య మూడో వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ హైటెక్స్లో ఏర్పాటు చేసిన సభకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్, రోశయ్య ట్రబుల్ షూటర్గా ఉండటం వల్లే సీఎంగా వైఎస్సార్ పని ఈజీ అయ్యిందన్నారు. సీఎంగా ఎవరున్నప్పటికీ నెంబర్ 2 పొజిషన్ మాత్రం రోశయ్యదేనని మనసులోని మాట బయటపెట్టారు.
ఆర్థికరంగంలో రాణించాలంటే ఆర్యవైశ్యుల పాత్ర ముఖ్యమన్నారు సీఎం. రాజకీయాల్లో ఆర్యవైశ్యులకు ప్రాధాన్యతనిస్తామని వెల్లడించారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు ప్రశ్నించాలి.. పాలకపక్షంలో ఉన్నపుడు పరిష్కరించాలి అని మాజీ సీఎం రోశయ్య చెప్పిన మాటలు అక్షర సత్యాలని పేర్కొన్నారు.
2007లో రోశయ్య సూచనలతో తాను సభల్లో మాట్లాడటం నేర్చుకున్నానని చెప్పకనే చెప్పారు. మాజీ సీఎం విగ్రహం ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో గుర్తింపు పొందిన నేతల్లో మాజీ సీఎం రోశయ్య తర్వాత టీజీ వెంకటేష్, అరికపూడి గాంధీ వంటి నేతలున్నారని చెప్పుకొచ్చారు.
ALSO READ: ములుగులో భూకంప కేంద్రం.. మళ్లీ మళ్లీ ప్రకంపనలు తప్పవా? శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే?
ఈ సందర్భంగా మాజీ సీఎం రోశయ్యతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన సందర్భంగా 16 వేల కోట్ల రూపాయలతో మిగులు బడ్జెట్తో తెలంగాణ ఏర్పడిందంటే అందుకు కారణం మాజీ సీఎం రోశయ్యేనని అన్నారు.
చట్ట సభల్లో అప్పటి స్పూర్తి కొరవడిందన్నారు. ప్రశ్నించే వాళ్లను మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ప్రస్తుతం పరిస్థితులు తయారయ్యాయని చెప్పారు. వాటి నుంచి బయటప పడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రోశయ్య లాంటి నేతలు ఇప్పుడు లేకపోవడం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందన్నారు. అలాంటి వ్యక్తులుంటే ముఖ్యమంత్రిగా ఎవరైనా రాణిస్తారని అన్నారు సీఎం రేవంత్.