Telangana election news(Political news in telangana): లోక్సభ ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గరపడుతున్నకొద్దీ నేతల మాటలు హద్దులు దాటుతున్నాయి. తెలంగాణలో అధికార కాంగ్రెస్, మరోవైపు బీజేపీ, ఇంకోవైపు బీఆర్ఎస్ సభలు, రోడ్డు షోలతో ప్రచారం హోరెత్తింది. ఆరోపణలు కూడా తారాస్థాయికి చేరాయి. తాజాగా ప్రధాని నరేంద్రమోదీ చేసిన ప్రతీ ఆరోపణలను సీఎం రేవంత్రెడ్డి తిప్పికొట్టారు. ప్రతీ పాయింట్ వివరించి మరీ కౌంటరిచ్చారు.
ఈసారి ఎన్నికలు గుజరాత్ పెత్తందారులకు-తెలంగాణ పౌరుషానికి మధ్య జరుగుతున్నాయని అన్నారు. తెలంగాణ పౌరుషం ఎవరికీ తలవంచదని, త్యాగాలు, పోరాటాలతో తెలంగాణను సాధించుకున్నామన్నా రు. నిజాం నవాబులను ఎదురించి రజాకార్లను తరిమి కొట్టిన చరిత్ర తెలంగాణకు ఉందన్నారు సీఎం రేవంత్రెడ్డి. గుజరాత్ జట్టుని ఓడించి కేంద్రంలో అధికారం చేపడదామన్నారు. పదేళ్లగా తెలంగాణ నుంచి కేంద్రానికి రూపాయి ఇస్తే.. అందులో 43 పైసలు మాత్రమే మనకు తిరిగి ఇస్తున్నారని గుర్తుచేశారు.
గుజరాత్కు బుల్లెట్ ట్రైన్ తీసుకెళ్లారని, తెలంగాణకు మెట్రోరైలు విస్తరణకు ఏమాత్రం నిధులు ఇవ్వలేదని దుయ్యబట్టారు తెలంగాణ ముఖ్యమంత్రి. వరంగల్ ఎయిర్పోర్టును మోదీ-అమిత్ షాలు అడ్డుకున్నారని ఆరోపించారు. సౌత్లో ప్రధాని మోదీ కాన్సెప్ట్పై సెటైర్లు వేశారు. ఆంధ్రప్రదేశ్కు మట్టి, కర్ణాటకకు చెంబు, తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చారని ఎద్దేవా చేశారు.
పనిలోపనిగా బీజేపీ-బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని ఆరోపించారు సీఎం రేవంత్. ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు సహకరించేలా కొన్నిచోట్ల బీఆర్ఎస్ బలహీనమైన అభ్యర్థులను నిలబెట్టిందన్నారు. కాంగ్రెస్కు 40 సీట్లు వస్తాయని అంటున్న కేసీఆర్.. బీఆర్ఎస్కు 12 సీట్ల వస్తే కేంద్రంలో చక్రం తిప్పుతామని ఎలా అంటున్నారని ప్రశ్నించారు. అప్పుడు నామా కేంద్రమంత్రి అవుతారని అంటున్నారు. ఈ లెక్కన బీజేపీతో బీఆర్ఎస్కు చీకటి ఒప్పందం లేదా అంటూ ప్రశ్నించారు. ప్రధాని మోదీ సాయంత్రం చదివిన స్క్రిప్ట్నే… కొత్తగూడెంలో కేసీఆర్ వివరించారని ఎద్దేవా చేశారు.
ALSO READ: నేను ముక్కు నేలకు రాస్తా.. లేదంటే మీరు రాయాలి మరీ: జగ్గారెడ్డి
మెదక్ జిల్లాలో ఎన్నికల ప్రచార సభకు వచ్చిన ప్రధాని నరేంద్రమోదీ.. కేసీఆర్, రేవంత్రెడ్డి సర్కార్పై విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ అవినీతిలో కూరుకుపోయిందని, అందుకే ప్రజలు ఆ పార్టీని పక్కన బెట్టారన్నది ప్రధాన ఆరోపణ. తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ పేరిట అక్రమంగా వసూళ్లు చేసి, ఢిల్లీకి భారీ ఎత్తున డబ్బును తరలిస్తున్నారన్నది ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు.
అవినీతిలో ఈ రెండు పార్టీలు ఒక్కటేనని చెప్పుకొచ్చారు. ప్రధాని నరేంద్రమోదీ ఏ రాష్ట్రానికి వెళ్లినా అక్కడ అవినీతి జరిగిందని పదే పదే చెప్పడం ఆయన స్టయిల్. 2019 ఎన్నికల్లో ప్రచారానికి ఏపీకి వెళ్లినప్పుడు అధికార టీడీపీకి పోలవరం ఏటీఎంగా మారిందని ఆయన వ్యాఖ్యలు చేసిన విషయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తు చేసుకుంటున్నారు.
మరోవైపు కొత్తగూడెంలో నిర్వహించిన రోడ్ షో మాట్లాడిన కేసీఆర్, తెలంగాణలో ఆర్ ట్యాక్స్పై వెంటనే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. మోదీ-రేవంత్రెడ్డి ఒక్కటేనని విమర్శించారు. నీళ్లు, నిధుల కోసం తెలంగాణ ప్రజలు కారు పార్టీని గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు కారు పార్టీ అధినేత.