CM Revanth Reddy: ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అత్యవసర సర్వీసుల ఉద్యోగాల సెలువులు రద్దు చేశారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు.
ఉగ్రవాదంపై పోరాటంలో భారత సైన్యానికి మనం ఉన్నామనే సందేశం ఇవ్వాలన్నారు. సైబర్ సెక్యూరిటీ విభాగం అప్రమత్తంగా ఉండాలని చెబుతూనే, ఫేక్ న్యూస్ ప్రచారం చేసేవారిపై ఉక్కుపాదం మోపాలన్నారు.
సీఎం రేవంత్ అత్యవసర సమావేశం
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు సీఎం రేవంత్రెడ్డి. ఈ భేటీకి డీజీపీ జితేందర్,హోం సెక్రటరీ రవి గుప్తా, ఆర్మీ, పోలీస్, డిజాస్టర్ మేనేజ్మెంట్,ఇతర సంబంధిత విభాగాల ఉన్నతాధికారులు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి హాజరయ్యారు. ప్రస్తుతం పరిస్థితి గురించి చర్చించారు.
ఇలాంటి సమయంలో రాజకీయాలు ఏ మాత్రం తావు ఉండదన్నారు. అత్యవసర సర్వీస్లు అందించే ఆయా విభాగాల ఉద్యోగుల సెలవులు రద్దు చేశారు. ఉద్యోగులు అంతా అందుబాటులో ఉండాల్సిందేనన్నారు. మంత్రులు, అధికారులు అందరూ అందుబాటులో ఉండాలన్నారు. విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలని సూచించారు.
ALSO READ: ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు తీపి కబురు, ఇంటికి లక్ష
రాజధానిలోని మూడు కమిషనరేట్ల పరిధిలో సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్కి అనుసంధానం చేయాలన్నారు. అన్ని జిల్లా కేంద్రాలు, సున్నిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. అలాగే భద్రతను పెంచాలన్నారు. ముఖ్యంగా హైదరాబాద్లోని అన్ని విదేశీ రాయబార కార్యాలయాలు, ఐటీ సంస్థల దగ్గర భద్రతను కట్టుదిట్టం చేయాలన్నారు.
హైదరాబాద్ సిటీలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే పీస్ కమిటీలతో మాట్లాడాలన్నారు. చరిత్ర ఉన్న రౌడీ షీటర్లు, పాత నేరస్తుల పట్ల పోలీస్ డిపార్ట్మెంట్ అప్రమత్తంగా ఉండాలన్నారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు.
వాళ్లను అదుపులోకి తీసుకోండి
బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిలవలు, అత్యవసర మెడిసిన్ సిద్దం చేయాలన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో బెడ్ల గురించి ఎప్పటికప్పుడు సమాచారం తీసుకోవాలన్నారు. వీలైతే రెడ్ క్రాస్ సంస్థతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఆహార నిల్వలు తగినంత ఉండేలా చూడాలని ఆదేశించారు సీఎం రేవంత్రెడ్డి.
ప్రభుత్వ ఉద్యోగులు మీడియా, సోషల్మీడియాలో అసవసర ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు సీఎం రేవంత్రెడ్డి. ఫేక్ న్యూస్ ప్రచారం చేసే వారిపైన ఉక్కు పాదం మోపాలని, దీనివల్ల ప్రజల్లో మరింత ఆందోళన పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ తరహా వార్తలను అరికట్టడానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలన్నారు.
ముఖ్యంగా సైబర్ సెక్యూరిటీపై అప్రమత్తంగా ఉండాలన్నారు. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండేలా టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అలాగే పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి వచ్చినవారు అనధికారికంగా నివసిస్తున్నవారిని తక్షణమే అదుపులోకి తీసుకోవాలన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమాచార వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు.
ఆపరేషన్ సిందూర్ పట్ల ప్రతి భారతీయుడు గర్వపడుతున్నారని అన్నారు. ఇలాంటి సమయంలో అందరం త్రివిధ దళాలకు అండగా ఉండాలన్నారు. ముఖ్యమంత్రిగా నా బాధ్యతలు తాను నిర్వర్తిస్తున్నానని చెప్పారు. భారత రక్షణ రంగంలో హైదరాబాద్ అత్యంత కీలక ప్రాంతమని, అన్ని విభాగాలను ప్రభుత్వం అప్రమత్తం చేసిందని వివరించారు.