CM Revanth Reddy: హైదరాబాద్ నగర అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నిజాం కాలం నాటి వారసత్వ సంపదను కాపాడుకుంటూనే, ఆధునిక వసతులతో నగరాన్ని ప్రపంచ పటంలో నిలుపుతామని హామీ ఇచ్చారు. బూమ్ రుకున్ ఉద్ దౌల చెరువు వంటి చారిత్రక కట్టడాలను నిజాం మనకు ఇచ్చిన ఆస్తిగా అభివర్ణించారు. “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక”లో భాగంగా నగరాన్ని కాలుష్య రహితంగా మారుస్తామని, నగరవాసులకు స్వచ్ఛమైన గాలి, మంచి వాతావరణం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
నగర ప్రాధాన్యతను వివరిస్తూ.. “ఇది ఓల్డ్ సిటీ కాదు.. ఇది ఒరిజినల్ సిటీ” అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. నగర అభివృద్ధిలో ఎంఐఎం (MIM) పార్టీ పూర్తి మద్దతు ఇస్తోందని, రాబోయే రోజుల్లో దక్షిణ హైదరాబాద్పై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. ఆక్రమణకు గురైన చెరువులు, పార్కులు, నాలాలను కాపాడి, వాటిని పర్యాటక కేంద్రాలుగా మారుస్తామని స్పష్టం చేశారు. అంబర్పేటలో కబ్జాకు గురైన బతుకమ్మ కుంటను ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి పునరుద్ధరించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
చెరువుల రక్షణ కోసం ప్రభుత్వం మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకోనుంది. ప్రతి చెరువు వద్ద లేక్ పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. అలాగే చెరువుల పరిసరాల్లో లేక్ ఎకానమీని సృష్టించనున్నట్లు వెల్లడించారు. దీనివల్ల మహిళా సంఘాలకు ఉపాధి దొరుకుతుందని, అభివృద్ధి చేసిన చెరువుల వద్ద మహిళలు వ్యాపారాలు చేసుకోవచ్చని సూచించారు. మూసీ నదిని కూడా పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి, అక్కడ రాత్రంతా వ్యాపారాలు చేసుకునేలా నైట్ ఎకానమీని ప్రోత్సహిస్తామని చెప్పారు. నిరుద్యోగులు, వ్యాపారవేత్తలకు మూసీ ఒడ్డున మంచి అవకాశాలు కల్పిస్తామన్నారు.
హైడ్రా (HYDRAA) పనితీరుపై స్పందిస్తూ.. ప్రారంభంలో కూల్చివేతల సమయంలో చాలామంది విమర్శించారని, కానీ ఇప్పుడు చెరువులు కబ్జా కోరల నుంచి విముక్తి చెందుతుంటే ప్రజలంతా సంతోషిస్తున్నారని సీఎం అన్నారు. మూసీ పరిసరాల్లో ఇళ్లు కోల్పోయిన పేదలకు ప్రభుత్వం అన్యాయం చేయదని, వారికి ప్రత్యామ్నాయ ఇళ్లు ఇస్తామని భరోసా ఇచ్చారు. రంజాన్ పండుగ వేళ పాతబస్తీ అభివృద్ధి కోసం మరిన్ని నిధులు విడుదల చేస్తామని, అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులే ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Read Also: GHMC WhatsApp number: మీ వీధిలో చెత్త ఉందా? ఫొటో తీసి వాట్సాప్ చేయండి: జీహెచ్ఎంసీ కొత్త సేవలు