CM Revanth Reddy: రైతు భరోసా నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. రూ.2,482 కోట్లను బటన్ నొక్కి రైతుల ఖాతాలో జమ చేశారు. అనంతరం రైతు భరోసా సభలో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతలపై నిప్పులు చెరిగారు. రాష్ట్రం కొత్తగా ఏర్పాటైన తర్వాత రూ.69 వేల కోట్ల అప్పులు మాత్రమే ఉన్నట్లు సీఎం గుర్తుచేశారు. కానీ గత బీఆర్ఎస్ పాలనలో రూ.7 లక్షల కోట్లకు పైగా అప్పులు పెరిగిపోయాయని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల ఊబిలో ముంచేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ లేవడానికి వీలులేకుండా అప్పులతో మన్ను కప్పారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బడి పిల్లల కూరగాయలు, బట్టలకు కూడా చెల్లించకుండా గత ప్రభుత్వం బకాయిలు పెట్టిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అటు సర్పంచ్ లకు వందల కోట్లు బకాయిలు పెట్టారని ఫలితంగా పలువురు సర్పంచ్ లు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు గద్దరన్న ప్రగతి భవన్ కు పోతే ఎండలో నాలుగు గంటలు కూర్చోబెట్టారని పేర్కొన్నారు. స్వయం సహాయక మహిళలు బడి పిల్లలకు వండి పెడితే వాళ్లకు కూడా డబ్బులు ఇవ్వలేదని మండిపడ్డారు. ‘హాస్టళ్లలో చదువుకునే పిల్లలకు మైస్ ఛార్జీలు ,కాస్మోటిక్ ఛార్జీలు ఇవ్వలేదు. అప్పులతో పాటు అడ్డగోలుగా తప్పులు కూడా చేశారు. ఢిల్లీకి పోయే పరిస్థితి లేకుండా చేశారు’ అంటూ గత కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
మరోవైపు ఉచిత కరెంటు తామిచ్చామని చెబుతున్నా బీఆర్ఎస్ నేతలకు సీఎం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘ఉచిత కరెంటు ను కనిపెట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఉచిత కరెంటు కాంగ్రెస్ పార్టీ పెటెంట్. ఉచిత కరెంటు మాది అన్న సన్నాసులను ఆడబిడ్డలు చీపురుకట్టలు తిరగేసి కొడతారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఉచిత కరెంటుతో పాటు విద్యుత్ బకాయిలను రద్దు చేస్తు సంతకం పెట్టారు. కాంగ్రెస్ వస్తే కరెంటు కష్టాలు అని ఇప్పుడు విమర్శిస్తున్నారు. నెలకు రూ. 1000 కోట్లు ఉచిత కరెంటు కోసం ఖర్చు చేస్తున్నాం. ఇప్పటి వరకు రూ.30 వేల కోట్లు ఖర్చు చేశాం’ అని రేవంత్ చెప్పుకొచ్చారు.
మరోవైపు కాళేశ్వరం కోసం రూ. లక్షా రెండు వేల కోట్లు చెల్లిస్తే రెండేళ్లలో కూలిపోయి కూలేశ్వరం అయిందని సీఎం ఎద్దేవా చేశారు. డబ్బులు గోదావరిలో కలిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఏ ఊరిలో రైతులు పంటలు పండించినా కాళేశ్వరం నీళ్లతోనే పండాయి అన్నారు. మూడేళ్లలో కాళేశ్వరం నుంచి చుక్క నీరు రాకపోయినా 2 కోట్ల 80 లక్షల టన్నుల ధాన్యాన్ని తెలంగాణ రైతుల పండించారు. కేసీఆర్ ఎంత కాలం కాశీ మజలీ కథలు చెప్తారు. ఆయన కథలు విన్న తర్వాత తెలంగాణ ప్రజలు ఫామ్ హస్ లో పెట్టారు. చిన్న రాక్షసులు బయలుదేరి కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారని చెపుతున్నాడు. కేసీఆర్ రావాలని ఎవరు కోరుకుంటున్నారు?’ అని రేవంత్ ప్రశ్నించారు.
Also Read: బయట వర్షం.. ఇంట్లో ఏసీ లీకేజీ.. ఈ చిట్కాలతో చెక్ పెట్టండి!
దమ్ముంటే రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేయడంపై సీఎం రేవంత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నీ అయ్య జాగీరా, నీ తాత గడీలు అనుకుంటున్నవా అంటూ ప్రశ్నించారు. వరి వేసుకుంటే ఉరే అన్న కేసీఆర్ ఫామ్ హౌస్ లో వరి పండించి నాలుగు వేల రెండువందలకు క్వింటా అమ్ముకున్నారని ఆరోపించారు. కేసీఆర్ మళ్లీ వస్తే భార్య భర్తల ఫోన్లు వింటాడు తప్ప ఏమీ చేయరని ఎద్దేవా చేశారు. సొంత బిడ్డే తన ఫోన్ ను ట్యాప్ చేసిన విషయాన్ని బహిరంగంగా పేర్కొందని గుర్తుచేశారు. మరోవైపు తనకు కిరిటాలు పెట్టుకోవాలి, వజ్ర వైడూర్యాలు సంపాదించాలన్న కోరిక లేదని రేవంత్ అన్నారు. పదవులు శాశ్వతం కాదని, మాటలు శాశ్వతమన్నారు. మాట కోసం ఎంతకైనా నిలబడతానని.. అబద్దాల పునాదులపై ప్రభుత్వాన్ని నడపనను రేవంత్ తేల్చి చెప్పారు.
Also Read: సూర్యుడితో స్నేహం.. మొబైల్కు ప్రాణం.. అదరగొడుతున్న స్మార్ట్ బెంచీలు!