Solar Smart Benches: సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ స్మార్ట్ సిటీగా మారుతున్న ఒడిశా రాజధాని భువనేశ్వర్ నగర ప్రజలకు సరికొత్త కానుకను అందించింది. నగరంలో పర్యావరణహితమైన అత్యాధునిక సాంకేతికతతో కూడిన ‘సోలార్ పవర్డ్ స్మార్ట్ బెంచీలను’ అధికారులు ప్రారంభించారు. ఈ బెంచీలపై కూర్చుని సేదతీరడమే కాకుండా ప్రజలు తమ మొబైల్ ఫోన్లను ఉచితంగా ఛార్జింగ్ చేసుకునే సదుపాయాన్ని కల్పించారు.
ఈ స్మార్ట్ బెంచీల ప్రత్యేకత ఏమిటంటే ఇవి పూర్తిగా పర్యావరణానికి అనుకూలమైనవి. వీటిపై అమర్చిన సోలార్ ప్యానెల్స్ పగటిపూట సూర్యరశ్మిని గ్రహించి విద్యుత్గా మారుస్తాయి. ఈ శక్తితోనే బెంచీలకు అనుసంధానించిన మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు పనిచేస్తాయి. దీనివల్ల సాధారణ విద్యుత్ వినియోగం తగ్గడమే కాకుండా కర్బన ఉద్గారాలను అరికట్టవచ్చని నగర మున్సిపల్ అధికారులు చెబుతున్నారు.
ఈ బెంచీలు కేవలం మొబైల్ ఛార్జింగ్కు మాత్రమే పరిమితం కాలేదు. రాత్రి సమయాల్లో స్వయంగా వెలిగేలా ప్రత్యేకమైన ఎల్ఈడీ లైట్లను వీటికి అమర్చారు. సోలార్ విద్యుత్ ఆధారంగా ఈ లైట్లు కూడా పనిచేయనున్నాయి. సాయంత్రం కాగానే ఆటోమేటిగ్గా లైట్లు వెలిగేలా ఈ బెంచ్ లను తీర్చిదిద్దినట్లు భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా రెండు స్మార్ట్ బెంచ్ లను మాత్రమే ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. నగరంలోని షహీద్ నగర్ తో పాటు రమాదేవి మహిళ యూనివర్శిటీ ముందు దీనిని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు బీఎంసీ కమిషనర్ ఎన్. గణేష్ తెలిపారు.
Also Read: క్లీనింగ్ ఇక చాలా ఈజీ.. సోఫాలు, మంచాల కోసం.. బెస్ట్ వ్యాక్యూమ్ క్లీనర్స్!
స్మార్ట్ బెంచ్ పై ఉన్న సోలార్ ప్యానెల్స్.. సౌరశక్తిని సంప్రదాయ విద్యుత్ గా మార్చి.. దానికి కనెక్ట్ చేసిన ఇన్వర్టర్ లో నిల్వ చేస్తాయని బీఎంసీ కమిషనర్ తెలిపారు. దీని నుంచే ఛార్జింగ్, రాత్రిపూట లైటింగ్ కోసం విద్యుత్ సరఫరా కానున్నట్లు చెప్పారు. భువనేశ్వర్ లోని పార్కులు, మతపరమైన ప్రదేశాలు, విశ్వవిద్యాలయాలు, ఇతర రద్దీ ప్రదేశాల్లోనూ వీటిని ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు ఎన్. గణేష్ స్పష్టం చేశారు. నగరంలోని 25-30 ప్రదేశాలలో ఈ సోలార్ స్మార్ట్ బెంచీలను ఏర్పాటు చేసేందుకు బీఎంసీ ప్రయత్నిస్తున్నట్లు వివరించారు.
Also Read: మీ ఫోన్ స్క్రీన్ ఈ 5 సంకేతాలు చూపిస్తోందా? అస్సలు నిర్లక్ష్యం చేయెుద్దు.. భారీ నష్టం జరగొచ్చు!