CM Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి కావడంతో.. ఇక పాలన పరుగులు పెట్టాలని నిర్ణయించారు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి. అన్ని విభాగాల అధికారులు జవాబుదారీ తనంతో పని చేయాలని తేల్చిచెప్పారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రభుత్వ శాఖల కార్యదర్శుల పని తీరును తాను స్వయంగా సమీక్షిస్తానని తేల్చిచెప్పారు.
అన్నిశాఖల కార్యదర్శులతో సీఎం రేవంత్ సమావేశం
ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా వందశాతం విజయవంతం కావాలన్నారు సీఎం. అందుకు అధికారుల సహకారం ఉండాలన్నారు. పని తీరు మరింత మెరుగుపరుచుకోవాలని, మార్పు రాకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 2047 నాటికి రాష్ట్రాన్ని మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరించిందన్నారు. కార్యాచరణ ప్రణాళిక అద్భుతంగా ఉన్నప్పటికీ, అధికారుల సహకారం అవసరమని నొక్కి వక్కానించారు.
మంగళవారం సాయంత్రం ప్రభుత్వంలోని అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, ఉన్నతాధికారులు, సీఎంఓ అధికారులతో ముఖ్యమంత్రి సచివాలయంలో సమావేశమయ్యారు. దాదాపు ౩ గంటలకుపైగా సమీక్ష చేశారు. రానున్న రోజుల్లో అనుసరించాల్సిన కార్యాచరణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. జనవరి 31 లోగా అన్ని ప్రభుత్వశాఖల్లో ఈ-ఫైలింగ్ విధానం అమలు చేయాలని తేల్చిచెప్పారు. కాగితాలు, ఫైళ్లు పట్టుకొని తిరిగే పరిస్థితి ఉండకూడదని న్నారు.
ఇక మూడునెలలకు ఒకసారి సమీక్ష
ఆయా శాఖల పరిధిలోని కార్యక్రమాల అమలుకు ప్రత్యేకంగా డాష్ బోర్డు సిద్ధం చేసి దాన్ని సీఎస్, సీఎంఓ డాష్ బోర్డుతో అనుసంధానం చేయాలన్నారు. కోర్ అర్బన్ ఏరియాలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. కార్పొరేట్ తరహాలో సర్కారు స్కూళ్లలో విద్యార్థుల నమోదు శాతం పెంచేందుకు పలు సూచనలు చేశారు. ముఖ్యంగా రవాణా సదుపాయం, బ్రేక్ ఫాస్ట్, మిడ్ డే మీల్స్ అమలు దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.
అన్ని విభాగాలు సమన్వయంతో సమర్థవంతంగా పని చేస్తే తెలంగాణ రైజింగ్ విజన్-2047 లక్ష్యాలను అలవోకగా సాధించగలమన్నారు. విజన్ అంటే కేవలం ప్రచారానికి పరిమితమనే అపోహను తిప్పికొట్టేలా కార్యాచరణ చేపట్టాలన్నారు. క్యూర్, ప్యూర్, రేర్ అభివృద్ధికి అన్ని విభాగాలు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులు, టీచింగ్ హాస్పిటల్స్ అన్నింటిలో మెరుగైన వైద్య సేవలు అందించేలా ఉండాలన్నారు. నిమ్స్ తరహాలో సనత్నగర్, కొత్తపేట, అల్వాల్ టిమ్స్, వరంగల్ హాస్పిటల్, ఉస్మానియా కొత్త ఆసుపత్రి ప్రజలకు మెరుగైన వైద్యం అందించేలా ఉండాలన్నారు.
ALSO READ: నా భర్త తాగిండు.. ఐతే కొడతావా? పోలీసులపై మహిళ ఆగ్రహం
ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో రెగ్యులర్- కాంట్రాక్టు-అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన దాదాపు 10 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఆయా ఉద్యోగులకు సంబంధించిన పూర్తి వివరాలు జనవరి 26 లోగా ప్రధాన కార్యదర్శికి అందించాలన్నారు. ఉద్యోగాల డేటా విషయంలో అధికారులదే పూర్తి బాధ్యత అని తేల్చి చెప్పేశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు క్రమం తప్పకుండా జీతాలు, ఈపీఎఫ్ అందుతున్నాయో లేదో సంబంధిత శాఖల అధికారులు పరిశీలన చేయాలన్నారు.
లక్ష్యాలను సాధించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించరాదని తేల్చి చెప్పేశారు ముఖ్యమంత్రి. ఇకపై కార్యదర్శులు ప్రతి నెలా సీఎస్కు నివేదికలు సమర్పించాలన్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి శాఖ కార్యదర్శుల పనితీరును సమీక్షిస్తానన్నారు. ఐఏఎస్ అధికారులు ప్రతి 10 రోజులకోసారి క్షేత్రస్థాయికి వెళ్లాలన్నారు. నెలలో కనీసం మూడు సార్లు తమ శాఖకి సంబంధించి క్షేత్ర స్థాయి పరిశీలన చేయాలన్నారు. దీనికితోడు రాష్ట్రానికి పెట్టుబడులు ఎంత మేరకు గ్రౌండయ్యాయి, వాటి పురోగతిని ప్రతి నెలా సమీక్ష చేయాలన్నారు. పరిశ్రమలకు అవసరమైన భూసేకరణ చేయాలన్నారు. ఇందుకోసం అవసరమైన మేరా ప్రత్యేకంగా అధికారులను నియమించాలన్నారు.