CM Revanth Reddy : యంగ్ ఇండియా. ఇది రేవంత్ బ్రాండ్. పోలీస్ స్కూల్. పోలీస్ ఉద్యోగుల పిల్లల కోసం ప్రత్యేక పాఠశాల. దేశంలోనే తొలిసారి. సైనిక్ స్కూల్స్ తరహాలో.. అన్నిరకాల వసతులు, అత్యాధునిక సౌకర్యాలతో పర్ఫెక్ట్ స్కూల్. హైదరాబాద్ శివారు మంచిరేవులలో మొదటి పోలీస్ స్కూల్ను ప్రారంభించారు సీఎం రేవంత్రెడ్డి. త్వరలోనే ప్రతీ నియోజకవర్గంలో 25 ఎకరాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ అందుబాటులోకి వస్తాయని చెప్పారు. పోలీస్ స్కూల్ కోసం 100 కోట్ల కార్పస్ ఫండ్ క్రియేట్ చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టే.. ఇప్పుడు యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఏర్పాటు చేసి పోలీస్ కుటుంబాలకు బహుమతిగా ఇస్తున్నామన్నారు ముఖ్యమంత్రి.
పోలీస్ స్కూల్.. ఇది రేవంత్ బ్రాండ్..
యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఓపెనింగ్ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రుల్లో ఒక్కొక్కరికి ఒక్కో బ్రాండ్ ఉందని అన్నారు. రూ.2 కిలో బియ్యం ఎన్టీఆర్ బ్రాండ్ అని.. ఐటీతో చంద్రబాబు ఒక బ్రాండ్ క్రియేట్ చేశారని.. వైఎస్సార్కు రైతు బాంధవుడిగా బ్రాండ్ ఉందని.. ఇక తన బ్రాండ్ “యంగ్ ఇండియా” అని స్వయంగా ప్రకటించారు సీఎం రేవంత్. మహాత్ముడి స్ఫూర్తితో యంగ్ ఇండియా బ్రాండ్ను తెలంగాణలో క్రియేట్ చేసుకున్నామన్నారు. ఒలంపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, అకాడమీని ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు.
Also Read : కవితా ఏ తోడు లేక.. ఎటేపమ్మా ఒంటరి నడకా?
సీఎం.. మంచి ఫుట్బాల్ ప్లేయర్
దేశ భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉందని.. అందుకే ఎడ్యుకేషన్, ఎంప్లాయిమెంట్ అనేది తమ ప్రభుత్వ బ్రాండ్ అన్నారు. నిరుద్యోగులకు సాంకేతిక శిక్షణ ఇచ్చేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి.. ఆనంద్ మహేంద్రను చైర్మన్గా నియమించమన్నారు. దేశంలోనే ది బెస్ట్ యూనివర్సిటీగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని తీర్చిదిద్దుతామని తెలిపారు సీఎం. దేశ చరిత్రలో ఎంతో మంది ప్రధానులు, ముఖ్యమంత్రులు అయ్యారని.. కానీ అందులో కొద్ది మంది మాత్రమే చరిత్రలో గుర్తుండిపోయారని.. ఆ కొద్దిమంది తీసుకున్న నిర్ణయాలు చరిత్రను మలుపు తిప్పాయని అన్నారు. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవం సందర్భంగా.. పిల్లలతో కలిసి కాసేపు ఉత్సాహంగా ఫుట్బాల్ ఆడారు సీఎం రేవంత్ రెడ్డి.