CM Revanth Reddy Speech in Narsapur Public Meeting: బీజేపీకి ఎన్నికలప్పుడే రాముడు గుర్తొస్తాడని, మన తాతలు రామనవమి చేయలేదా అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేవుడు గుడిలో ఉండాలి.. భక్తి గుండెల్లో ఉండాలని అన్నారు. బీజేపీ వాళ్లు మనకు సాంప్రదాయాలు నేర్పాలా అని ప్రశ్నించారు. నరేంద్ర మోదీ రాజ్యంగాన్ని రద్దు చేయాలని చూస్తున్నారని అన్నారు. తెలంగాణకు గాడిద గుడ్డునిచ్చిన బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టాల్సిందేనని పిలుపునిచ్చారు.
నర్సాపూర్ జన జాతర సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్, కేసీఆర్పై విమర్శలు గుప్పించారు. ఓడిపోయన కేసీఆర్ ఏదేదో మాట్లాడుతున్నారని, కరీంనగర్ నుంచి తీసుకొచ్చి వెంకట్రామిరెడ్డిని పోటీ చేయిస్తున్నారని అన్నారు.
వెంకట్రామిరెడ్డి మల్లన్న సాగర్ భూములు గుంజుకున్నారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు కనీసం డిపాజిట్లు రావని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దుబ్బాక ఉపఎన్నికల్లో రఘునందన్ రావు గెలిచినా ఏం చెయ్యకపోతే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఓడించారని పేర్కొన్నారు. ఇప్పటికే రఘునందన్ రావు, వెంకట్రామిరెడ్డిలను చూశారు.. నీలం మధుకు అవకాశం ఇవ్వండని రేవంత్ రెడ్డి కోరారు.
Also Read: రేవంత్.. వన్ మ్యాన్ ఆర్మీ
ఇక మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం గురించి సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి దేశ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఇందిరా గాంధీ మెదక్పై ప్రత్యేక శ్రద్ధ చూపించడంతోనే ఈ ప్రాంతం అభివృద్ధి అయ్యిందని తెలిపారు. మెదక్ ఎంపీగా ఉన్నప్పుడే ఇందిరా గాంధీ చనిపోయారని చెప్పారు.