Hyderabad News: 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ ఎకానమీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం రేవంత్రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రప్రభుత్వ సహకారం కావాలన్నారు. నగర అభివృద్ధికి సహకరించాలని కేంద్రమంత్రి ఖట్టర్ని ఈ సందర్భంగా కోరారు.
పట్టణాభివృద్ధి శాఖ మంత్రుల ప్రాంతీయ సమావేశం
మంగళవారం ఉదయం హైదరాబాద్లోని హోటల్ ITC కోహినూర్లో కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రుల ప్రాంతీయ సమావేశం జరిగింది. కేంద్రమంత్రి మనోహర్లాల్ ఖట్టర్తోపాటు దక్షిణ-పశ్చిమ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మంత్రులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్రెడ్డి, మా రాష్ట్ర ప్రణాళికలు ఇప్పటికే కేంద్రానికి పంపించామన్నారు. కేంద్రం వేగంగా అనుమతులు ఇచ్చిసహకరించాలని కోరారు. డిసెంబర్ 9న 2047 విజన్ డాక్యుమెంట్ ను ప్రెజెంట్ చేయబోతున్నామని తెలిపారు. తెలంగాణ.. దేశానికే ఆదర్శంగా ఉండాలన్నదే మా ఆలోచన విధానమన్నారు.
ఆలోచనను బయటపెట్టిన సీఎం రేవంత్రెడ్డి
మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్, గోదావరి జలాల తరలింపు, మూసీ ప్రక్షాళనతో పాటు వివిధ అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వ సహకారం ఉండాలన్నారు ముఖ్యమంత్రి. రాబోయే ఏడాదిలో 3 వేల ఎలక్ట్రిక్ బస్సులను హైదరాబాద్ సిటీకి తీసుకురావాలని ప్రణాళికలు వేస్తున్నట్లు చెప్పారు.
2034 నాటికి ఓ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దే లక్ష్యంతో పని చేస్తున్నామని వివరించారు. హైదరాబాద్ సిటీ అభివృద్ధితోపాటు భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయబోతున్నామని తెలిపారు. రాష్ట్రంలో డ్రై పోర్టు ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నామని, మా పోటీ ఇతర రాష్ట్రాల నగరాలతో కాదని తేల్చిచెప్పారు.
ALSO READ: జూనియర్ కాలేజీలో ర్యాగింగ్.. విద్యార్థుల మధ్య ఫైటింగ్
మా పోటీ కేవలం సింగపూర్, టోక్యో, న్యూయార్క్ నగరాలతో ఉంటుందన్నారు సీఎం రేవంత్. అందుకు కేంద్ర ప్రభుత్వ నుంచి సహకారం అవసరమన్నారు. హైదరాబాద్ సిటీ వివిధ రంగాలకు హబ్గా మారిందన్నారు. దేశంలో ప్రతీ సీఎంకు ప్రధాని పెద్దన్న లాంటివారని, రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలన్నారు. దేశ రాజధాని కాలుష్య కోరల్లో చిక్కుకుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్స్ రీజనల్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి..
డిసెంబర్ 9న 2047 విజన్ డాక్యుమెంట్ ను ప్రెజెంట్ చేయబోతున్నాం
హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం సహకరించాలని కేంద్ర మంత్రి ఖట్టర్ కు విజ్ఢప్తి
2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యంగా తెలంగాణ పనిచేస్తోంది… https://t.co/8zP2BNkKyJ pic.twitter.com/P87h7baqTl
— BIG TV Breaking News (@bigtvtelugu) November 18, 2025