CM Revanth Reddy: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై నమోదైన పోక్సో కేసు ఉదంతం.. తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. బండి భగీరథ్ ను ఎందుకు అరెస్ట్ చేయలేదంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. పోక్సో లాంటి ఎంతో కఠినమైన చట్టంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ ఇంతవరకూ భగీరథ్ విచారణకు హాజరుకాకపోవడంపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో బండి సంజయ్ కు అనుకూలంగా ఉంటోందని.. సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లోనే భగీరథ్ ఉన్నాడంటూ కూడా విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే భగీరథ్ పై నమోదైన కేసుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.
హైదరాబాద్ లో ఓ మీడియా సంస్థ నిర్వహించిన ప్రోగ్రామ్ లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి.. బండి భగీరథ్ పై నమోదైన కేసుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కీలక సూచనలు చేశారు. తక్షణమే బండి సంజయ్ తన కొడుకును తీసుకుని వచ్చి విచారణను ఎదుర్కోవాలని విజ్ఞప్తి చేశారు. కీలకమైన హోదాలో ఉండి హుందాగా వ్యవహరించాల్సిన బాధ్యత సంజయ్ పై ఉందని పేర్కొన్నారు. తనకు తానుగా ఆయన కొడుకును విచారణకు అప్పగించాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ కోరారు. కొడుకు కారణంగా బండికి తలవంపులు వచ్చాయని అభిప్రాయపడ్డారు. పోక్సో కేసు బాధితురాలి ఏజ్ సర్టిఫికేట్లు సేకరించామని, ఆధారాలు దొరికితే చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు.
మరోవైపు ఇదే ప్రోగ్రామ్ లో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. డ్రగ్స్ తీసుకునే వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయితే కాళ్లు విరగ్గొడుతామని హెచ్చరించారు. వాటి నిర్మూలనకు ఈగల్ అనే స్పెషల్ ఫోర్స్ ను సైతం రంగంలోకి దింపినట్లు పేర్కొన్నారు. 6, 7 తరగతుల పిల్లలు సైతం డ్రగ్స్ బారిన పడుతున్నట్లు ఈ సందర్భంగా రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాల బాధ వింటుంటే పిచ్చెక్కుతోందని వ్యాఖ్యానించారు. మరోవైపు ఫామ్ హౌస్ లో డ్రగ్స్, సారాబుడ్లతో పలువురు పట్టుబడుతున్న విషయాన్ని సీఎం గుర్తుచేశారు.
Also Read: చికిత్సకు డబ్బు లేదని.. ఆస్పత్రిలో బాంబు పెట్టాడు.. వీడు మామూలోడు కాదు!
తమతో కలిసి నడవమని ఇటీవల ప్రధాని మోదీ పిలుపునిచ్చిన అంశంపై కూడా రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రధాని అన్న మాటలకు అర్థం వేరని పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధి విషయంలో పీఎం మోదీ సహకారం కోరినట్లు రేవంత్ చెప్పారు. ఈ సందర్భంగా వికసిత్ భారత్ ప్రస్తావనను మోదీ తీసుకొచ్చారని.. ఈ అంశంలో కేంద్రంతో కలిసి నడవమని కోరగా.. సరే అంటూ పనిచేద్దామని బదులు ఇచ్చినట్లు సీఎం చెప్పుకొచ్చారు. ఒకవేళ మోదీ కాంగ్రెస్ ను టీజ్ చేయాలని భావిస్తే.. తనకు ఏ స్థాయిలో డిమాండ్ ఉందో ఈ ఘటనతో అర్థమైందిగా అంటూ రేవంత్ చమత్కరించారు.