Electric Buses: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రజా రవాణాను మరింత మెరుగుపరిచేందుకు, పర్యావరణ పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వచ్చే ఏడాది నాటికి గ్రేటర్ పరిధిలో ఏకంగా 3వేల ఎలక్ట్రిక్ (ఈవీ) బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఆర్టీసీ భవిష్యత్తు ప్రణాళికలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈవీ బస్సుల వల్ల పర్యావరణానికి మేలు జరగడమే కాకుండా, ఆర్టీసీకి నిర్వహణ ఖర్చులు భారీగా తగ్గుతాయని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆర్టీసీ నెలకు సుమారు 2వేల కోట్ల రూపాయల విలువైన డీజిల్ను వినియోగిస్తోందని, ఇది సంస్థపై పెద్ద ఆర్థిక భారంగా మారిందని ఆయన గుర్తుచేశారు. ఈ ఖర్చును తగ్గించుకుంటూ, ప్రయాణికులకు ఆధునిక సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
ఈ ప్రణాళికలో భాగంగా ఇప్పటికే ప్రభుత్వం వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసిందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. మిగిలిన బస్సులను కూడా ఒకేసారి కాకుండా, దశలవారీగా రోడ్లపైకి తీసుకువస్తామని స్పష్టం చేశారు. ఈ సరికొత్త ఈవీ బస్సుల రాకతో హైదరాబాద్ నగరంలో కాలుష్యం తగ్గడంతో పాటు, నగరవాసులకు మరింత సౌకర్యవంతమైన, సురక్షితమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది.
Also Read: చంద్రబాబు నాకెంతో స్పెషల్.. రాహుల్ను పీఎం చేస్తా.. సీఎం రేవంత్ ఆసక్తికర కామెంట్స్