తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన “తెలంగాణ రైజింగ్ 2047” విజన్ డాక్యుమెంట్ను ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఘనంగా ఆవిష్కరించారు. 83 పేజీలతో పది అంశాలను డాక్యూమెంట్ లో చేర్చారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ ఆర్థిక నిపుణులు సుమన్ బేరి, ఆనంద్ మహేంద్ర, కార్తిక్ మురళీధరన్, దువ్వూరి సుబ్బరావు, అరవింద్ సుబ్రహ్మణ్యం, సినీ ప్రముఖుడు పద్మభూషణ్ చిరంజీవి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రివర్గ సభ్యులు మరియు పలువురు విశిష్ట అతిథులు హాజరయ్యారు.
ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజల తరఫున అందరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజన్ డాక్యుమెంట్ రూపకల్పనలో ప్రజల భాగస్వామ్యం విశేషమని పేర్కొన్నారు. ఆన్లైన్ ద్వారా నాలుగు లక్షల మంది ప్రజలు, నిపుణులు తమ సూచనలు, అభిప్రాయాలు తెలియజేయడం ఈ పత్రానికి ప్రజాస్వామ్య బలం చేకూర్చిందన్నారు.
తెలంగాణ మట్టిలో ఎప్పటి నుంచో ఉన్న జల్–జమీన్–జంగల్ పోరాటాల స్పూర్తి, సామాజిక న్యాయం కోసం సాగిన ఉద్యమాల చరిత్రను స్మరించుకుంటూ, ఇదే స్ఫూర్తి రాష్ట్ర నిర్మాణానికి దారితీసిందని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రజలు ఆశించిన సమాన అవకాశాలు, సామాజిక న్యాయం, అభివృద్ధి ఇంకా పూర్ణంగా సాధ్యంకాలేదని, అందుకే ఈ కొత్త విజన్ డాక్యుమెంట్ ద్వారా 2047 నాటికి సమగ్ర తెలంగాణ నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు.
భారత స్వాతంత్ర్య శతాబ్ది సంవత్సరం 2047 నాటికి దేశం ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగాలనే కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దానికి అనుగుణంగా, తెలంగాణను కూడా అత్యున్నత స్థాయిలో అభివృద్ధి పథంలో నిలపడం ఈ పత్రం ప్రధాన ధ్యేయం అని వెల్లడించారు.
రైతు కుటుంబం నుంచి వచ్చిన తనకు పేదలు, రైతుల సమస్యలు బాగా తెలుసని చెప్పారు. ఈ డాక్యుమెంట్ కూడా పేదలు, రైతుల చుట్టే కేంద్రీకృతమై ఉందని తెలిపారు. దేశాభివృద్ధికి ఎడ్యుకేషన్, ఇరిగేషన్ ముఖ్యమని నెహ్రూ భావించారు. అందుకే ఆయన యూనివర్సిటీలు, సాగునీటి ప్రాజెక్టులు ఎక్కువగా నిర్మించారని గుర్తుచేశారు. ఆయన మార్గంలోనే తన విజన్ ఉంటుందని స్పష్టం చేశారు.
3 ట్రిలియన్ డాలర్ల లక్ష్యంతో ముందుకు
2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ
2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యం.
భారత జాతీయ GDPలో కనీసం పదో వంతు వాటాను తెలంగాణ సాధించాలనే ధ్యేయంతో.. ప్రభుత్వం ఈ విజన్ రూపొందించింది.
ఈ ప్రణాళిక రూపకల్పనలో
తెలంగాణ రైజింగ్ 2047″ దార్శనిక పత్రం, రాబోయే రెండు దశాబ్దాల్లో రాష్ట్రాన్ని సమగ్రంగా, సమ్మిళితంగా సుస్థిరంగా అభివృద్ధి చేసే దిశగా భవిష్యత్తుకు బాటలు వేసే దార్శనిక పత్రం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్.
రాబోయే రోజుల్లో ప్రపంచంతో పోటీ పడేలా.. తెలంగాణను ఆవిష్కరించే బృహత్తరమైన ప్రయత్నంలో భాగమే తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్
ఇది రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే రోడ్ మ్యాప్.
తెలంగాణ రాష్ట్ర ఉజ్జ్వల భవిత కోసం..ప్రజల భవిష్యత్తు కోసం.. భావి తరాల కోసం.. ముందుచూపుతో “తెలంగాణ రైజింగ్ 2047” డాక్యుమెంట్ రూపుదిద్దుకుంది.
సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో రాష్ట్ర ప్రభుత్వం ఈ డాక్యుమెంట్ తయారు చేసింది.
నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల అభిప్రాయాలు.. ఆకాంక్షలకు ఇందులో చోటు కల్పించింది.
అన్ని శాఖల మంత్రులు, అన్ని విభాగాల అధికారులు, మేధావులు, అన్ని రంగాల నిపుణులు, పారిశ్రామికవేత్తలు, సామాజిక, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల సలహాలకు ప్రాధాన్యమిచ్చింది.
ఈ డాక్యుమెంట్ తయారీలో NITI Aayog కీలక భూమిక నిర్వహించింది. ISB (ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్) ప్రొఫెసర్లు డాక్యుమెంట్ తయారీలో పాలుపంచుకున్నారు.
వరుస సంప్రదింపులు, రోజుల తరబడి చర్చలు, ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ప్రముఖుల సలహాలు, సూచనలు, వివిధ దేశాలు అనుసరిస్తున్న ఆదర్శవంతమైన విధానాలన్నింటినీ ప్రభుత్వం అధ్యయనం చేసింది.
వీటన్నింటినీ విశ్లేషించుకొని.. వడపోసి.. తెలంగాణ భవిష్యత్తు ఎలా ఉండాలో ఈ దార్శనిక పత్రంలో పొందుపరిచింది.
ఇందులో ఉన్న ప్రతి అధ్యాయం తెలంగాణ పురోగాభివృద్ధికి దోహదపడుతుంది.
2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా వృద్ధి చేయడం తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ విజన్ ప్రధాన లక్ష్యం.
దీంతో తెలంగాణ అభివృద్ధిలో ప్రపంచ దేశాలకు ధీటుగా నిలబడి.. దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఒకటిగా నిలుస్తుంది.