Revanth Weekly Report: ఈవారం సీఎం రేవంత్ బిజీ బిజీ షెడ్యూల్ గా సాగింది. ఢిల్లీ హైదరాబాద్ లో వరుస కార్యక్రమాలు, కొత్త ప్రణాళికలు, కీలక శాఖలపై రివ్యూలు చేశారు. ఏఐసీసీ లీగల్ సెల్ ఈవెంట్ లో పాల్గొనడం, టూరిజం అభివృద్ధికి మన ఊరు.. మన టూరిజం, కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పై స్టడీ కోసం ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయడం, టీచర్ల ప్రమోషన్లపై షెడ్యూల్ రిలీజ్ చేసి వేగంగా ప్రక్రియ పూర్తి చేసే పనిలో ఉంది సర్కారు. మరిన్ని కీ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం.
27-08-2025 ఆదివారం ( సరికొత్తగా, వేగంగా CMRF చెక్కులు )
సీఎం సహాయ నిధి పథకాన్ని అక్రమాలకు, అవినీతికి ఛాన్స్ లేకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే పటిష్ఠంగా అమలు చేస్తోంది. ఇప్పటికే పథకాన్ని పారదర్శకంగా అమలు చేసేందుకు ఆన్లైన్లో దరఖాస్తు విధానాన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. తాజాగా మరో కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. సీఎంఆర్ఎఫ్ సాయం కోసం ఆన్లైన్లో అప్లై చేసే టైంలో ఇచ్చిన మొబైల్ నెంబర్ కు చెక్కు వివరాలతో పాటు సీఎం రేవంత్ మెసేజ్ ను జత చేసి పంపుతున్నారు. అలాగే చెక్ రిలీజైన తేదీతో పాటు దరఖాస్తు చేసిన ప్రజాప్రతినిధి కార్యాలయానికి ఎప్పుడు చేరుతుందనే వివరాలను కూడా మెసేజ్ రూపంలో వెళ్తోంది. అధికారులు సీఎంఆర్ఎఫ్ దరఖాస్తు ప్రక్రియను ఆన్లైన్ చేసినట్టుగానే.. లబ్ధిదారులకు అందించే చెక్కుల వివరాలను కూడా వారి వాట్సప్ కే పంపుతున్నారు. అలాగే చికిత్సకు ముందు ఆస్పత్రులకు ఇచ్చే లెటర్ ఆఫ్ క్రెడిట్ పేపర్స్ పైనా క్యూఆర్ కోడ్ను ప్రింట్ చేస్తున్నారు. ఆ కోడ్ను స్కాన్ చేయగానే ఆ లెటర్ ఎవరికి ఇచ్చారు, ఆ పేషంట్ పేరు, మంజూరు చేసిన నగదు వివరాలన్నీ కనిపిస్తాయి. సీఎంఆర్ఎఫ్ సాయంలో ప్రభుత్వం రికార్డు నెలకొల్పింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన 19 నెలల కాలంలోనే సీఎంఆర్ఎఫ్ కింద 1,399.21 కోట్ల నిధులను విడుదల చేసింది. 2023 డిసెంబరు 7 నుంచి 2025 జులై 26నాటికి దాదాపు 3,23,739 మంది నిరుపేద, పేద, మధ్య తరగతి కుటుంబాలకు సర్కారు వివిధ రూపాల్లో సాయం అందించింది. చికిత్సకు ముందు అందించే లెటర్ ఆఫ్ క్రెడిట్ ల ద్వారా 27,872 మందికి 413.25 కోట్లు, అలాగే చికిత్స అనంతరం దరఖాస్తు చేసుకున్న 3,01,867 మందికి 985.96 కోట్ల చొప్పున నిధులను విడుదల చేసింది.
28-07-2025 సోమవారం ( క్యాబినెట్ కీలక నిర్ణయాలు )
జులై 28న జరిగిన తెలంగాణ మంత్రి సమావేశంలో కీలక అంశాలు చర్చకు వచ్చాయి. స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల కల్పనలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర శాసనసభ ఆమోదించిన రెండు బిల్లులకు వెంటనే చట్ట బద్ధత కల్పించాలని రాష్ట్ర మంత్రిమండలి రాష్ట్రపతికి విజ్ఞప్తి చేసింది. కేంద్ర ప్రభుత్వం సూచనలతో రాష్ట్రంలోని రవాణా శాఖ అంతర్రాష్ట్ర చెక్పోస్టులను రద్దు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. హైదరాబాద్తోపాటు రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లలో మైక్రో బ్రూవరీస్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అంచనా వ్యయం సవరణలకు కేబినెట్ ఆమోదించింది. వైద్య ప్రవేశాల్లో స్థానికతపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై కేబినెట్ చర్చించింది.
29-07-2025 మంగళవారం ( పరిశ్రమలన్నీ ORR వెలుపలికే )
కాలుష్య రహిత నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దేందుకు అవసరమైన సంస్కరణలు చేపట్టాలని రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ కోర్ సిటీ ఏరియాలో ఉన్న కాలుష్య కారక పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటకు తరలించాలన్నారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై సీఎం రేవంత్ జులై 29న కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. కాలుష్య రహితంగా మార్చే ప్రణాళికలతో పాటు పాతబస్తీ మెట్రో విస్తరణ పనులు, మూసీ రివర్ ఫ్రంట్, మిరాలం ట్యాంక్ ప్రాంతాన్ని పర్యాటక అభివృద్ధి వంటి అంశాలపై సీఎం రేవంత్ సమీక్షించారు. విపరీతమైన కాలుష్యంతో ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి నగరాల్లో ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అలాంటి పరిస్థితి హైదరాబాద్ లో తలెత్తకూడదని అన్నారు. నగరాన్ని కాలుష్య రహితంగా మార్చడంతో పాటు 25 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు సీఎం. అంతేకాదు సిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ కేబులింగ్పై ఫోకస్ పెట్టాలన్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖతో సమన్వయం చేసుకుంటూ త్వరగా పనులు పట్టాలెక్కేలా చూడాలన్నారు.
30-07-2025 బుధవారం ( రాష్ట్రంలో మరో కొత్త డిస్కం )
తెలంగాణలో విద్యుత్ విభాగం ప్రక్షాళన చేయడానికి అవసరమైన సంస్కరణలు అమలు చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సంస్కరణల్లో భాగంగా కొత్తగా మరో డిస్కమ్ ఏర్పాటు చేయాలని, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇంధన శాఖపై సీఎం రేవంత్ జులై 30న తన నివాసంలో రివ్యూ చేశారు. NPDCL, SPDCL లతో పాటు కొత్తగా మరో డిస్కమ్ను ఏర్పాటు చేసి దాని పరిధిలోకి వ్యవసాయ రంగంతో పాటు 200 యూనిట్ల ఉచిత గృహ విద్యుత్, స్కూళ్లు, కాలేజీలకు ఉచిత విద్యుత్ పథకాలన్నీ తీసుకురావాలని సూచించారు. దీనికి రాష్ట్రమంతా ఒకే యూనిట్గా కొత్త డిస్కం పరిధి ఉండాలని చెప్పారు. కొత్త డిస్కమ్ ఏర్పాటు వల్ల ఇపుడున్న డిస్కమ్ల పనితీరు మెరుగుపడుతుందని, జాతీయ స్థాయిలో రేటింగ్ పెరుగుతుందన్న ఆలోచన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. డిస్కమ్ల ఆర్ధిక స్థితి గతులను మెరుగుపరిచేందుకు సంస్కరణలు తప్పనిసరని అన్నారు. డిస్కమ్ల పునరవ్యవస్తీకరణతో పాటు విద్యుత్ సంస్థలపై ఇప్పుడు ఉన్న రుణ భారం తగ్గించాలని అధికారులకు సూచించారు. రుణాలపై వడ్డీ భారం తగ్గించేందుకు వెంటనే ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. 10 శాతం వరకు వడ్డీపై తీసుకున్న రుణాలతో డిస్కమ్లు డీలా పడ్డాయని, వాటిని తక్కువ వడ్డీ ఉండేలా రీస్ట్రక్చర్ చేసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలతో పాటు ప్రభుత్వ ఆఫీసుల్లో సోలార్ విద్యుత్ వినియోగాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఇందిర సోలార్ గిరి జల వికాసం పథకం రాష్ట్రంలోని అన్ని గిరిజన, ఆదివాసీ తండాలు, ఏజెన్సీ ఏరియాల్లో అమలు చేయాలని నిర్దేశించారు. వచ్చే మూడేళ్లలో 2 లక్షల 10 వేల మంది ఎస్టీ రైతులకు ఈ పథకం వర్తింపజేయాలని, 6 లక్షల ఎకరాలకు సౌర విద్యుత్ పంపుసెట్లను అందించి లక్ష్యాన్ని చేరుకోవాలని సమీక్షలో సూచించారు.
30-07-2025 బుధవారం ( పన్నుల వసూళ్ల కోసం )
వస్తు, సేవల పన్నుకు GST సంబంధిత ఎగవేతలకు అడ్డుకట్ట వేయాలని సీఎం రేవంత్ రెడ్డి జులై 30న చేసిన రివ్యూలో వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు సూచించారు. జీఎస్టీ పరిధిలోని సంస్థలు సక్రమంగా పన్ను చెల్లించేలా చూడాలన్నారు. అదే సమయంలో చెల్లింపుదారులకు సంబంధించి అనుమానాలు, డౌట్ల నివృత్తికి కాల్సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. వాణిజ్య పన్నుల శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సెంటర్ నిర్వహణలో ఏఐను వాడుకోవాలన్నారు. జీఎస్టీ, ఇతర పన్నుల విషయంలో ఇతర రాష్ట్రాలు ఎలాంటి పద్దతులు ఫాలో అవుతున్నాయో స్టడీ చేసి మేలైన విధానాలను స్వీకరించాలన్నారు. పన్ను చెల్లింపుదారులకు మెరుగైన సేవలు అందించేలా కార్యాలయాల్లో అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయాలన్నారు.
31-07-2025 గురువారం ( టీచర్లకు ప్రమోషన్లు )
ప్రభుత్వ టీచర్లకు ప్రమోషన్లు కల్పించాలని నిర్ణయించిన రాష్ట్ర సర్కారు జులై 31న అందుకు షెడ్యూల్ జారీ చేసింది. ఖాళీలను ప్రకటించి… అర్హులైన టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వబోతోంది. ఈ ప్రక్రియను 10 రోజుల్లో పూర్తి చేసేలా కార్యాచరణ రెడీ చేసింది. ఆగస్టు 2 నుంచి 11 వరకు కౌన్సెలింగ్ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు డాక్టర్ నవీన్ నికోలస్. ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసే సెకండరీ గ్రేడ్ టీచర్లు… ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లుగా లేదా ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులుగా ప్రమోట్ పొందుతారు. స్కూల్ అసిస్టెంట్లకు గెజిటెడ్ హెచ్ఎంలుగా పదోన్నతి కల్పిస్తారు. మొత్తం మీద 3,867 మందికి పదోన్నతులు లభించనున్నాయి. గత ఏడాది జూన్, జులైలలో టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వగా, ఏడాదిలోపే అర్హులైన ఇంకొందరికి ఇప్పుడు ప్రమోషన్లు ఇస్తుండటంతో టీచర్లు, టీచర్ల సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
01-08-2025 శుక్రవారం ( పీసీ ఘోష్ రిపోర్ట్ సమర్పణ )
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి న్యాయ విచారణ కోసం నియమించిన జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికను అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి అందించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో రిపోర్ట్ అందించారు. ఈ కమిషన్ నివేదికను స్టడీ చేయడానికి ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. ఈ కమిటీ.. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను అధ్యయనం చేసి పూర్తి సారాంశాన్ని తయారు చేస్తుంది. నీటి పారుదల శాఖ కార్యదర్శి, న్యాయ శాఖ కార్యదర్శి, జీఏడీ కార్యదర్శి సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేయగా, ఈ కమిటీ కమిషన్ నివేదికను అధ్యయనం చేసి పూర్తి సారాంశాన్ని ఈ నెల 4న రాష్ట్ర క్యాబినెట్ కు సమర్పించనుంది.
Also Read: అప్పుడో లెక్క.. ఇప్పుడో లెక్క.. బాబులో వచ్చినమార్పులివే..
02-08-2025 శనివారం ( మన ఊరు.. మన టూరిజం )
తెలంగాణలో టూరిజం స్పాట్ల అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతి ప్రయత్నం చేస్తోంది. ఇది వరకు మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించి.. వారిని పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లారు. ఇప్పుడు కూడా మరింత స్కోప్ పెంచేలా ప్రయత్నాలు జరుగుతున్నాయ్. తాజాగా టూరిస్ట్ డెస్టినేషన్స్ అభివృద్ధితో పాటు వాటిని ప్రమోట్ చేసేందుకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. ఇందులో భాగంగా మన ఊరు.. మన టూరిజం కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. మారుమూల గ్రామాల్లోనూ పర్యాటక ప్రదేశాల అభివృద్ధితో పాటు వాటిని ప్రపంచానికి పరిచయం చేయాలన్న లక్ష్యంతో ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపడుతోంది. విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, యువతను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలనుకుంటున్నారు. తెలంగాణ చాలా జిల్లాల్లో చారిత్రక ప్రదేశాలు, పురాతన దేవాలయాలు, కోటలు, చెరువులు, జలపాతాలు, ట్రెక్కింగ్ స్పాట్లు ఉన్నాయి. ఆయా జిల్లాల్లో ఎన్ని కిలో మీటర్ల పరిధిలో ఏ టూరిస్ట్ స్పాట్ ఉందన్న దానిపై అధికారులు రూట్ మ్యాప్ రెడీ చేశారు. పర్యాటక స్థలాల సంరక్షణ, పరిశుభ్రత, ప్రచార కార్యక్రమాలు స్వచ్ఛంద సంస్థలు చేపట్టేలా ప్లాన్ చేస్తున్నారు. అంతేగాకుండా, ప్రతి జిల్లాలో పర్యాటక అభివృద్ధి కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు. కేంద్రం పీఎం శ్రీ పథకం కింద కొన్ని స్కూళ్లను ఎంపిక చేసి అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నది. స్టూడెంట్లను విహారయాత్రలకు తీసుకెళ్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ దర్శిని పేరుతో స్కూల్ నుంచి కాలేజీ స్థాయి స్టూడెంట్లకు పర్యాటక, చారిత్రక ప్రాంతాలపై అవగాహన కల్పిస్తోంది.
Story By Vidya Sagar, Bigtv