Municipal Elections: మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో హుజురాబాద్ కాంగ్రెస్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. దశాబ్ద కాలంగా పార్టీని నమ్ముకుని ఉన్న తమకు మొండిచేయి చూపి, నిన్న మొన్న పార్టీలోకి వచ్చిన వారికి బి-ఫామ్స్ ఇవ్వడంపై ఆశావహులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రణవ్ తీరును నిరసిస్తూ వారు భారీ బహిరంగ ప్రకటన చేశారు.
పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, అధికారం లేకపోయినా జెండా మోసి కేసులు ఎదుర్కొన్న తమను అవమానించారని ఆశావహులు ఆవేదన వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ నుండి వలస వచ్చిన వారికి, పార్టీలు మారిన వారికి ప్రాధాన్యత ఇచ్చి, నిబద్ధత గల కార్యకర్తలను పక్కన పెట్టారని ఆరోపించారు. “మేము పార్టీ కోసం రక్తం ధారపోస్తే, ఇప్పుడు అధికారం రాగానే కొత్తగా వచ్చిన వారు పీఠాలు ఎక్కుతారా?” అని వారు సూటిగా ప్రశ్నించారు.
పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పుష్పలత మాట్లాడుతూ.. తమపై ‘బల్మూరి వెంకట్ వర్గం’ అనే ముద్ర వేసి కావాలనే తొక్కేస్తున్నారని మండిపారు. దళిత మహిళగా, మున్సిపల్ చైర్మన్ రేసులో ఉన్న తన ఎదుగుదలను సహించలేక, ఆరు నెలల క్రితం పార్టీలో చేరిన వారికి టికెట్ ఇచ్చారని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. గ్రౌండ్ లెవల్లో బలం ఉన్నప్పటికీ, కావాలనే వివక్ష చూపుతున్నారని ధ్వజమెత్తారు.
నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రణవ్ పై ఎం.డి. అఫ్సర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రణవ్ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని, కొంత మంది చేతిలో కీలుబొమ్మగా మారారని విమర్శించారు. కాంగ్రెస్ శ్రేణులను కాపాడుకోవడంలో విఫలమైన ప్రణవ్ ను వెంటనే ఇన్చార్జ్ పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. కాసులకు అమ్ముడుపోయిన టికెట్లు.. ఫేక్ సర్వేలతో అధిష్టానాన్ని తప్పుదోవ పట్టించారు! డబ్బు ఉన్న వారికే టికెట్లు అమ్ముకున్నారని, అర్హత గల వారికి అన్యాయం చేశారని అభ్యర్థులు సంచలన ఆరోపణలు చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజల నాడిని పట్టించుకోకుండా, వంద శాతం ‘ఫేక్ సర్వేలు’ (దొంగ సర్వేలు) సృష్టించి తమను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రణవ్ లోలోపల బిఆర్ఎస్ నాయకులకే సహకరిస్తున్నారని వారు అనుమానం వ్యక్తం చేశారు.
పార్టీ తమకు బి-ఫామ్ ఇవ్వకపోయినా, ప్రజల మద్దతు తమకే ఉందని ఆశావహులు స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి గెలిచి తీరుతామని సవాల్ విసిరారు. “గెలిచిన తర్వాత మళ్లీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బల్మూరి వెంకట్ సమక్షంలో కాంగ్రెస్ జెండానే మోస్తాం.. మా బలం ఏంటో నిరూపిస్తాం” అని ధీమా వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే జోక్యం చేసుకుని హుజురాబాద్లో జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలని వారు వేడుకున్నారు. క్షేత్రస్థాయిలో కష్టపడిన తమకు న్యాయం చేయాలని, అమ్ముడుపోయిన నాయకుల మాటలు నమ్మవద్దని కోరుతూ ఆశావహులు భావోద్వేగానికి గురయ్యారు.
Also Read: MSVPG OTT: ఓటీటీలోను మన శంకర వరప్రసాద్ గారు రికార్డ్.. ఏకంగా అన్ని భాషల్లో రిలీజ్?