CM Revanth Reddy Delhi Tour: పెండింగ్లో ఉన్న సీట్లను ప్రకటించేందుకు సిద్ధమైంది కాంగ్రెస్ హైకమాండ్. ఇందులో భాగంగా కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సమావేశం బుధవారం జరగనుంది. పార్టీ చీఫ్ మల్లిఖార్జునఖర్గే ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశంలో అభ్యర్థులను ఖరారు చేయనుంది. ఇక తెలంగాణ విషయాన్నికొస్తే.. 17 నియోజకవర్గాలకుగాను ఇప్పటికి 9 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. ఇక మిగిలిన ఎనిమిది మందిని ఎంపిక చేయనుంది. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్, మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు.
పెండింగ్లో ఉన్న 8 సీట్లలో మెదక్, భువనగిరి, వరంగల్, నిజామాబాద్, హైదరాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్ నియోజకవర్గాల అభ్యర్థులు ఉన్నారు. ఇదిలావుండగా సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో గతరాత్రి స్క్రీనింగ్ కమిటీ సమావేశమైంది. ఎవరెవరికి టికెట్లు ఇవ్వాలనేదానిపై దాదాపుగా ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఆదిలాబాద్ నుంచి డాక్టర్ సుమలత, సుగుణ పేర్లు పరిశీలనలో ఉన్నాయి.
వరంగల్ నుంచి సాంబయ్య, భువనగిరి నుంచి చామల కిరణ్కుమార్రెడ్డి, కరీంనగర్కు తీన్మార్ మల్లన్న, మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్రెడ్డి, నిజామాబాద్ నుంచి జీవన్రెడ్డి రేసులో ఉన్నారు. ఇక ఖమ్మం నుంచి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సోదరుడు ప్రసాద్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ వైఫ్ నందిని పోటీ పడుతున్నారు. మెదక్ నుంచి నీలం మధు పోటీ లాబీయింగ్ చేస్తున్నారు. మొత్తానికి ఇవాళ ఏడెనిమిది మంది పేర్లు ఖరారు కావచ్చని నేతలు చెబుతున్నమాట. రేసులో ఎక్కువమంది ఉండడంతో చివరి క్షణంలో అభ్యర్థులను మార్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెబుతున్నారు.
Also Read: Congress 8th List: కాంగ్రెస్ ఎనిమిదో జాబితా విడుదల.. భువనగిరి నుంచి చామల కిరణ్ పోటీ..
మరోవైపు ప్రచార వ్యూహంపై ఈనెల 29న శుక్రవారం సాయంత్రం గాంధీ భవన్లో పీసీసీ కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్రెడ్డి, ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ కార్యదర్శులు, సీనియర్ నేతలు హాజరుకానున్నారు. మరోవైపు ఎన్నికల హీట్ పెరుగుతుండడంతో ముఖ్యమంత్రి గాంధీభవన్కు వచ్చి నేతలతో సమావేశమై దిశానిర్దేశం చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.