Addanki Dayakar: బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ తీరుపై ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల నేపథ్యంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్లో ఓటర్లు కేటీఆర్ను చావు దెబ్బ కొట్టినా ఇంకా ఆయనలో బలుపు తగ్గలేదని.. చింత చచ్చినా పులుపు చావలేదని దయాకర్ దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ విజయం కమలంను వాడిపోయేట్లు చేసిందని, గులాబీ రేకులను చింపేసిందని ఆయన అభివర్ణించారు. కేటీఆర్ ఒక్కడితోనే బీఆర్ఎస్ పతనం ఖాయమని దయాకర్ జోస్యం చెప్పారు.
2023 ఎన్నికల్లో వంద సీట్లు అన్నా ప్రజలు బొంద పెట్టినా, ఆ తరువాత పార్లమెంట్ ఎన్నికల్లో “గుండు సున్నా” వచ్చినా కేటీఆర్కు సిగ్గు, బుద్ధి రాలేదని ఆయన ఆరోపించారు. రాజకీయంగా పతనమైనా కేటీఆర్ తీరు మారలేదని పేర్కొన్నారు. కేసీఆర్ కళ్లకు కేటీఆర్, హరీశ్ రావు కృష్ణా-అర్జునుల్లా గంతలు కట్టారని కవిత అంటున్నారని ప్రస్తావిస్తూ, వారు కృష్ణా-అర్జునులు కాదని, దుర్యోధన-దుస్యాసనులని దయాకర్ ఘాటుగా విమర్శించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపుకు సహకరించిన అందరికీ అద్దంకి దయాకర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి “మాస్టర్ మైండ్”తో అన్ని తానై నడిపించిన తీరుకు నిదర్శనమని అన్నారు. సామాన్య కార్యకర్తగా సీఎం గెలిపించిన తీరును ప్రజలు హర్షిస్తున్నారని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రత్యేకమైందని, కాంగ్రెస్ పార్టీకి నష్టాన్ని కోరుకునే వాళ్లు ఓడిపోతుందని, ఐక్యత లోపించిందని ప్రచారం చేశారని, వాళ్లందరికీ ఈ గెలుపు సమాధానమని దయాకర్ స్పష్టం చేశారు.
కేసీఆర్ మాట్లాడిన మాటలు చాగంటి ప్రవచనాల్లా ఉంటాయని, వాటికి సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇస్తే మాత్రం బుతులా అని కేటీఆర్ అంటున్నారని దయాకర్ ప్రశ్నించారు. బీసీలు అంటే కేటీఆర్కు చులకన భావమని విమర్శించారు. కేటీఆర్ పై మాగంటి గోపీనాథ్ తల్లి చేసిన ఆరోపణలకు ఆయన సమాధానం చెప్పలేదని గుర్తుచేశారు. బీజేపీ-బీఆర్ఎస్ రాజకీయ మిత్రులుగా దేశం మొత్తానికి తెలుసని దయాకర్ అన్నారు. రేవంత్ రెడ్డి వస్తే బుల్డోజర్ వస్తుందని ప్రచారం చేశారని, కానీ బుల్డోజర్ వచ్చి కారును (బీఆర్ఎస్ను) ఈడ్చుకుంటూ పోయిందని ఎద్దేవా చేశారు. “దమ్ముంటే అరెస్ట్ చెయ్” అని కేటీఆర్ అంటున్నారని, దమ్ము ఎందుకు, పోలీసులకు చెప్తే చేస్తారని దయాకర్ బదులిచ్చారు. కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పజెపితే అరెస్ట్ చేయమని ఎందుకు అడగట్లేదని ఆయన కేటీఆర్ను నిలదీశారు.