Jhansi Reddy: వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ రాజకీయాల్లో కాంగ్రెస్ సీనియర్ నేత హరిప్రసాద్ సంచలన ఆరోపణలతో పొలిటికల్ హీట్ పెంచారు. పాలకుర్తి కాంగ్రెస్ ఇన్చార్జ్ ఝాన్సీ రెడ్డి, బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు లోపాయికారీ ఒప్పందంతో పనిచేస్తున్నారని, వీరిద్దరూ ఒక్కటై ‘కోవర్ట్ రాజకీయాలు’ నడుపుతున్నారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
హరిప్రసాద్ మాట్లాడుతూ.. పైకి ప్రత్యర్థులుగా కనిపిస్తున్న ఝాన్సీ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం కలిసి పనిచేశారని ఆరోపించారు. జమస్తాన్పురంలో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థికి కాంగ్రెస్ నేత ఝాన్సీ రెడ్డి మద్దతు ఇచ్చారని, దీనికి ప్రతిఫలంగా చెర్లపాలెం, మడిపెల్లి, సోమారం గ్రామాల్లో ఝాన్సీ రెడ్డి నిలబెట్టిన అభ్యర్థులకు ఎర్రబెల్లి సపోర్ట్ చేశారని సాక్ష్యాలతో సహా ప్రస్తావించారు.
మడిపెల్లిలో ఎర్రబెల్లికి చెందిన అభ్యర్థిని ఝాన్సీ రెడ్డి డబ్బుతో కొనుక్కున్నారని, సోమారంలో అసలు ఎర్రబెల్లికి ఏజెంట్లు కూడా లేరని హరిప్రసాద్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ రెబల్స్ గెలిస్తే, వాళ్లను తానే బలపరిచానని ఎర్రబెల్లి చెప్పుకుంటున్నారని విమర్శించారు. ఒకరికి డబ్బు ఉందన్న అహంకారం, మరొకరికి ఆరుసార్లు గెలిచానన్న ధీమాతో పాలకుర్తి ప్రజలను పిచ్చోళ్లను చేసి ఆడుకుంటున్నారని మండిపడ్డారు.
మీ ఇద్దరి చీకటి బంధం గురించి ప్రజలకు తెలిసిపోయిందని, ఝాన్సీ రెడ్డి, దయాకర్ రావు ఎంత ప్రయత్నించినా పాలకుర్తి ప్రజలను ఇక మోసం చేయలేరని హరిప్రసాద్ హెచ్చరించారు. మీ ఇద్దరినీ రాజకీయంగా బొందపెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. వీరిద్దరి కోవర్ట్ బంధానికి సంబంధించిన మరిన్ని విషయాలను త్వరలోనే బయటపెడతానంటూ హరిప్రసాద్ హెచ్చరించారు. సొంత పార్టీ నేతపైనే కాంగ్రెస్ సీనియర్ లీడర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది.
Read Also: అత్తాకోడళ్లపై ఆగ్రహం.. పాలకుర్తిలో ఏం జరుగుతోంది?