Congress Strategy: స్వేచ్ఛక బ్యూరో: దేశ వ్యాప్తంగా ఎన్నికల సమరానికి కాంగ్రెస్ ఇప్పటి నుంచే పక్కా వ్యూహంతో అడుగులు వేస్తోంది. మిషన్-పీఎం సాధన కోసం పార్టీ అధిష్ఠానం ఒక ‘కామన్ గోల్ ప్లాన్’ను సిద్ధం చేసింది. కేవలం ఎన్నికల ముందో, నోటిఫికేషన్ వచ్చాకో కాకుండా చాలా ముందస్తుగానే క్షేత్రస్థాయిలోకి దూసుకుపోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా నిలబెట్టడం, ఇండియా కూటమిని మరింత బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ సరికొత్త ప్లాన్ విజయవంతం కావడానికి కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప-ముఖ్యమంత్రులు కీలక పాత్ర పోషించనున్నారు.
రాహుల్ ను పీఎంను చేసే బాధ్యతలను ఆయా సీఎంలు, డిప్యూటీ సీఎంలు బాధ్యతలు తీసుకోనున్నారు. ఇందుకోసం కామన్ గోల్ ప్లాన్ విధానాలతో ముందుకు సాగనున్నారు. ఇందుకోసం తమ తమ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు,సుపరిపాలనను దేశవ్యాప్తంగా ప్రదర్శించడం వీరి ప్రధాన బాధ్యతగా లక్ష్యం పెట్టుకున్నారు. కేవలం సొంత రాష్ట్రాలకే పరిమితం కాకుండా, ఇతర రాష్ట్రాల్లో జరిగే ప్రచారాలు, డ్రైవ్లలో వీరు యాక్టివ్గా పాల్గొని పార్టీ మైలేజ్ను పెంచనున్నారు.ఈ మేరకు ఇప్పటికే ఏఐసీసీ లెవల్లో ప్రత్యేక ప్రణాళిక ను ఫిక్స్ చేస్తున్నారు.
కామన్ గోల్ ప్లాన్ వ్యూహాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు వీలుగా ప్రతి రాష్ట్రంలోనూ హైపవర్ స్పెషల్ కమిటీల’ను కాంగ్రెస్ అధిష్ఠానం ఏర్పాటు చేయనుంది.ఈ కమిటీలు స్థానిక రాజకీయ సమీకరణాలు, ప్రజా సమస్యలను నిరంతరం పర్యవేక్షిస్తాయి.రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలతో సమన్వయం చేసుకుంటూ, పార్టీ కేడర్ను ఎన్నికల మూడ్లోకి తీసుకురావడానికి అన్ని వేళల్లో అందుబాటులో ఉండనున్నారు. ఇక గతంలో చేపట్టిన భారత్ జోడో యాత్రల ద్వారా రాహుల్ గాంధీ ఇమేజ్ దేశవ్యాప్తంగా పెరిగింది. ఇప్పుడు ఆ క్రేజ్ను ఓట్ల రూపంలోకి మార్చుకునేందుకు ఒక ప్రత్యేక కార్యాచరణ సిద్ధమైంది.రాహుల్ గాంధీని ప్రజల్లో ఒక తిరుగులేని నాయకుడిగా,ప్రత్యామ్నాయ ప్రధాని ముఖచిత్రంగా ప్రెజెంట్ చేయడమే ఈ కార్యాచరణ ముఖ్య ఉద్దేశం.ముఖ్యంగా యువత,మహిళలు,రైతులు,కార్మికులే లక్ష్యంగా రాహుల్ గాంధీ మరింతగా ప్రజల్లోకి వెళ్లేలా పర్యటనలు ఖరారు కానున్నాయి.
Also Read: ప్రతిరోజూ దెయ్యాల టైమ్లో నిద్రలేచే అమ్మాయి… మూడు సీజన్ల పాటు ఫుల్ థ్రిల్ ఇచ్చే హర్రర్ స్టోరీ
బీజేపీని ఢీకొట్టాలంటే ఒంటరి పోరాటం సరిపోదని భావిస్తున్న కాంగ్రెస్, మిత్రపక్షాలతో కూడిన ‘ఇండియా’కూటమిని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించింది. సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టో వంటి విషయాల్లో ఎలాంటి విభేదాలు రాకుండా ముందస్తుగానే చర్చలు జరపనున్నారు.
ప్రాంతీయ పార్టీల ఆకాంక్షలను గౌరవిస్తూనే, జాతీయ స్థాయిలో కూటమి ఐక్యతను చాటడానికి కాంగ్రెస్ పెద్దన్న పాత్ర పోషించనుంది. అంతేగాక ఈసారి గతానికి భిన్నంగా ఎన్నికలకు ఏడాది ముందే రాహుల్ గాంధీని పీఎం అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించాలని కాంగ్రెస్ యోచిస్తోంది.
దీనివల్ల ప్రజల్లో స్పష్టత రావడమే కాకుండా, నరేంద్ర మోదీకి గట్టి ప్రత్యామ్నాయం రాహుల్ గాంధీ మాత్రమే అనే భావన దేశవ్యాప్తంగా బలపడుతుందని పార్టీ నమ్ముతోంది.
ఈ ప్రణాళికలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు దేశవ్యాప్తంగా ఒక భారీ పొలిటికల్ డ్రైవ్ను కాంగ్రెస్ పార్టీ చేపట్టబోతోంది.గ్రామ స్థాయి నుంచి మెట్రో సిటీల వరకు డిజిటల్, క్షేత్రస్థాయి ప్రచారాలను ముమ్మరం చేయనున్నారు.కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇచ్చే గ్యారెంటీలను ప్రతి ఇంటికీ చేర్చడమే ఈ డ్రైవ్ ప్రధాన లక్ష్యం.కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే ముందెన్నడూ లేనంత పక్కా ప్లానింగ్తో, ముందస్తు వ్యూహాలతో రంగంలోకి దిగుతుంది. దీనిలో భాగంగానే తాజాగా కేరళ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారణ కార్యక్రమం అనంతరం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు ఈ అంశంపై ప్రత్యేకంగా చర్చించారు. మరి ఈ ‘కామన్ గోల్ ప్లాన్’ హస్తం పార్టీకి ఎంతవరకు అధికారాన్ని తెచ్చిపెడుతుందో, రాహుల్ గాంధీని పీఎం పీఠంపై ఎలా కూర్చోబెడుతుందో వేచిచూడాల్సిందే.
Also Read: Manasa Varanasi : చీరకట్టులో బ్యూటిఫుల్ లుక్ మానస వారణాసి.. సో క్యూట్ అంతే..