Congress Protest: జగిత్యాల జిల్లాలో కేంద్ర ప్రభుత్వం ప్రజా, రైతు వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గళమెత్తారు. వరి, మక్కల కొనుగోళ్లలో కేంద్రం అవలంబిస్తున్న అలసత్వాన్ని నిరసిస్తూ.. ఆకాశాన్నంటుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్యర్యంలో భారీ ఆందోళన కార్యక్రమం చేపట్టారు.
ఆర్డీఓ కార్యాలయం వరకు పాదయాత్ర
పట్టణంలోని ఓల్డ్ హైస్కూల్ మైదానం నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు, స్థానిక ప్రజలతో కలిసి భారీ పాదయాత్ర నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ ఆఫీస్ ఎదుట భైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ నిరసన ప్రదర్శనలో రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, వెలమ కార్పొరేషన్ చైర్మన్ నర్సింగరావు తదితరులు పాల్గొని రైతులకు, ప్రజలకు మద్దతుగా నిలిచారు.
కేంద్రంపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తీవ్ర ఆగ్రహం
ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సామాన్య ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా గాలికొదిలేసిందని ధ్వజమెత్తారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడి పాలిట శాపంగా మారాయని, రూపాయి విలువ రోజురోజుకూ పడిపోతున్నా ప్రధానికి పట్టింపు లేదని విమర్శించారు. దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందనడానికి ప్రజలను విలాసాలకు దూరంగా ఉండమనడమే నిదర్శనమన్నారు. అలాగే, మతం పేరుతో రాజకీయాలు చేయడం తప్ప పేదల కష్టాలు కేంద్రానికి పట్టడం లేదని మండిపడ్డారు.
బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే..
రాష్ట్రంలో ప్రధాని ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ.. కేంద్రంలోని బీజేపీ విధానాలపై ఎందుకు నోరు మెదపడం లేదని మంత్రి ప్రశ్నించారు. కేటీఆర్, హరీష్ రావు, జీవన్ రెడ్డిలు బీజేపీ తప్పులను ఎందుకు ఎండగట్టడం లేదని అడిగారు. దీనిని బట్టి బీఆర్ఎస్ , బీజేపీ రెండు ఒక్కటేనని స్పష్టమవుతోందన్నారు.
రైతుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మూడు విడతలుగా వరి ధాన్యం కొనుగోలు చేసిందని, కానీ కేంద్ర పరిధిలోని ఎఫ్సీఐ మాత్రం రాష్ట్రం నుండి బియ్యం సేకరించకుండా ఇబ్బందులు పెడుతోందని ఆరోపించారు. కేంద్రానికి ఇంధన ధరలు పెంచడంపై ఉన్న శ్రద్ధ.. రైతుల ధాన్యం, మక్కల కొనుగోలుపై లేదని, తక్షణమే మద్దతు ధరతో పంటలను సేకరించాలని డిమాండ్ చేశారు.
డా. సంజయ్ కుమార్ మాట్లాడుతూ
ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్ల రూపాయి విలువ పడిపోతోందని, మత రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. FCI ద్వారా వరి, మొక్కజొన్నలు కొనకుండా కేంద్రం రాష్ట్రాలను నష్టాల్లోకి నెడుతోందని మండిపడ్డారు. జిల్లాలో ఇప్పటివరకు రూ. 86 కోట్ల మక్కలు కొన్నామని, ధాన్యం నిల్వలకు కొత్త గోదాములు కడుతున్నామని చెప్పారు. కేసీఆర్ను గతంలో విమర్శించిన జీవన్ రెడ్డి ఇప్పుడు దేవుడనడంపై ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. వెజ్, నాన్-వెజ్ మార్కెట్పై కొందరు అవగాహన లేకుండా రైతులను రెచ్చగొడుతున్నారని ఆయన విమర్శించారు.
Also Read: రైతు కష్టానికి కోమటిరెడ్డి భరోసా.. చౌటుప్పల్లో వరి ధాన్యం నిల్వకు భారీ ప్రైవేట్ గోదాం!