Special Officer: స్వేచ్చ బ్యూరో: రాష్ట్రంలో సింహాభాగం జనాభా ఉన్న కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో పౌర, అత్యవసర సేవలందించాల్సిన మూడు మున్సిపల్ కమిషనర్లకు స్పెషలాఫీసర్ కేవలం రెండు మీటింగ్ లకే పరిమితమయ్యారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ఫిబ్రవరి 11వ తేదీన జీహెచ్ఎంసీ మూడు ముక్కలుగా పునర్విభజించిన నాటి నుంచి ఆయన స్పెషలాఫీసర్ గా పదవీ బాధ్యతలు చేపట్టి, సుమారు వంద రోజులు గడిచిపోయినా, నేటికీ కోర్ అర్బన్ రీజియన్ లో ఆయన మార్కు నిర్ణయం ఒక్కటి కూడా లేకపోవటం గమనార్హం. స్పెషలాఫీసర్ కేవలం మూడు మున్సిపల్ కార్పొరేషన్ల స్టాండింగ్ కమిటీ, పాలక మండలి సమావేశాలకు హాజరుకావటం మినహా మరెక్కడ కన్పించటం లేదని, అధికారులకు అందుబాటులో ఉండటం లేదని తెల్సింది. మూడు నాలుగు విభాగాలకు ఉన్నతాధికారిగా వ్యవహారిస్తున్న సదరు స్పెషలాఫీసర్ ఏ విభాగం కార్యాలయంలోను తన కింది స్థాయి అధికారులకు గానీ, సందర్శన వేళల్లో సామాన్య సందర్శకులకు అందుబాటులో ఉండటం లేదని సమాచారం.
మూడు మున్సిపల్ కార్పొరేషనకు చెందిన స్టాండింగ్ కమిటీ, పాలక మండలి సమావేశాలను రెండురోజుల పాటు నిర్వహించి, అజెండాలోని పలు అంశాలను పరిశీలించి ఆమోదించటం వరకే ఆయన విధులు పరిమితమయ్యాయని, ఆ తర్వాత ఆయన సామాన్య ప్రజల మాట అలా ఉంచితే, కనీసం మూడు మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు మినహా మిగిలిన అధికారులెవ్వరికీ అందుబాటులో ఉండటం లేదని తెల్సింది. జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ ఆఫీసులకు కూడా స్టాండింగ్ కమిటీ సమావేశం గానీ, కౌన్సిల్ సమావేశం గానీ ఉంటేనే ఆయన వస్తున్నట్లు, మామూలు రోజుల్లో సిటీ అభివృద్దికి సంబంధించిన ఏమైనా పర్యటనలు గానీ, విభాగాల వారీగా సమావేశాలు, సమీక్షలు, సందర్శనలు గానీ ఇప్పటి వరకు నిర్వహించిన సందర్భాల్లేవని కొందరు మున్సిపల్ అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
సాధారణంగా బోనాలు, బక్రీద్, బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ పండుగలు వంటి సందర్భాల్లో ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా, ఘనంగా నిర్వహించేందుకు చేయాల్సిన ఏర్పాట్లపై గతంలో స్పెషలాఫీసర్లు కమిషనర్లతో కలిసి సమీక్షించి, అధికారులు, సిబ్బందికి తగిన సూచనలు, సలహాలిస్తూ దిశా నిర్దేశం చేసే వారు. గ్రేటర్ ఫస్ట్ కమిషనర్, స్పెషలాఫీసర్ గా వ్యవహారించిన సీవీఎస్ కే శర్మ కేవలం పగటి పూటనే గాక, రాత్రి పూట కూడా ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, తరుచూ అభివృద్ది, పౌర సేవల నిర్వహణను సమీక్షించే వారు.
Also read: హత్యల వెనుక అదిరిపోయే మిస్టరీ…నెట్ఫ్లిక్స్లో దుమ్ములేపుతున్న నంబర్ వన్ క్రైమ్ థ్రిల్లర్
శివారులోని పన్నెండు మున్సిపాల్టీల విలీనంతో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ కాస్త గ్రేటర్ గా మారింది. నాటి నుంచి నేటి వరకు జీహెచ్ఎంసీకి 2007 నుంచి సీవీఎస్కే శర్మ, ఆ తర్వాత ఎస్పీ సింగ్, ప్రస్తుతం గత ఫిబ్రవరి 11 నుంచి స్పెషలాఫీసర్ గా కొనసాగుతున్న జయేష్ రంజన్ తో కలిపి మొత్తం ముగ్గురు ఉన్నతాధికారులు స్పెషల్ ఆఫీసర్లుగా వ్యవహారిస్తున్నారు. గత ఫిబ్రవరి 11 నుంచి జయేష్ రంజన్ స్పెష లాఫీసర్ గా ఇంకా విధి నిర్వహణలో ఉన్నారు. గ్రేటర్ లో విలీనానికి ముందు కేవలం రూ. 7 కోట్ల బడ్జెట్ ఉన్న ఎల్బీనగర్ సర్కిల్ కు శర్మ ఒకే రోజు రూ. 72 కోట్ల అభివృద్ది పనులకు మంజూరీ ఇవ్వటం అప్పట్లో సంచలనంగా మారింది. అంత పెద్ద మొత్తంలో ఎల్బీనగర్ జోన్ లో అభివృద్ది పనులు చేపట్టేందుకు కావల్సిన ఆర్థిక వనరులను కూడా ఆయన ఒకే ఒక్క పర్యటనలో గుర్తించారు.
ఆ తర్వాత స్పెషలాఫీసర్ గా వచ్చిన ఎస్.పీ.సింగ్ కూడా తనదైన మార్కు పాలన చేశారు. 2009 నుంచి 2014 వరకు పాలక మండలి కొనసాగింది. ఆ తర్వాత వరుసగా, 2016, 2020లో పాలక మండలిలు ఎన్నుకున్నారు. కానీ క్యూర్ పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్ కు స్పెషలాఫీసర్ ను నియమించి వంద రోజులు గడిచినా, ఇప్పటి వరకు స్పెషలాఫీసర్ ఏ ఒక్క అంశంపై సమీక్షలు నిర్వహించిన దాఖలాల్లేవు. పైగా ఆయన స్పెషలాఫీసర్ గా బాధ్యతలు స్వీకరించిన నాడు కొత్తగా ఏర్పడిన రెండు మున్సిపల్ కార్పొరేషన్లు సీఎంసీ, ఎంఎంసీలకు ఒక్కో దానికి ఆర్థిక వెసులు బాటు కోసం రూ. 500 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.
కానీ ఇప్పటి వరకు తమకెలాంటి నిధులు విడుదల కాలేదని రెండు మున్సిపల్ కార్పొరేషన్ల అధికార వర్గాలు వెల్లడించాయి. ఫిబ్రవరి 11 వ తేదీన మూడు కార్పొరేషన్లు ఏర్పాటైనప్పటికీ, కొన్ని పౌర సేవల నిర్వహణ, మరి కొన్ని ఆర్థిక లావాదేవీలు జీహెచ్ఎంసీ ద్వారా కొనసాగించారు. ఆ తర్వాత కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ నుంచి కార్పొరేషన్ల వారీగా ఎవరి కార్యక్రమాలు వారే నిర్వహించుకుంటున్నారు. కానీ కొత్తగా ఏర్పడిన సీఎంసీ, ఎంఎంసీల్లో వేర్వేరుగా అభివృద్ది, మెయింటనెన్స్ కార్యక్రమాలతో పాటు పౌర సేవల నిర్వహణ ఎలా జరుగుతుందన్న విషయంపై స్పెషలాఫీసర్ ఒక్క సమీక్ష కూడా నిర్వహించిన దాఖలాల్లేవు.
Also read: హత్యల వెనుక అదిరిపోయే మిస్టరీ…నెట్ఫ్లిక్స్లో దుమ్ములేపుతున్న నంబర్ వన్ క్రైమ్ థ్రిల్లర్