Madhira Municipality: స్వేఛ్చ బ్యూరో: మధిర మున్సిపాలిటీ ఎన్నికల్లో సిపిఐ(CPI), సిపిఎం(CPM) పార్టీలు కారు పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సిపిఐ పార్టీ కాంగ్రెస్తో మున్సిపల్ ఎన్నికల్లో పొత్తు ఉంటాయని భావించింది. అయితే అందుకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ సిపిఐ పార్టీకి సరైన వార్డులు కేటాయించకపోవడంతో ఇద్దరి దోస్తీకి బ్రేకులు పడ్డాయి. దీంతో కొన్నిచోట్ల ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీతో పొత్తు కుదుర్చుకొని మునిసిపల్ ఎన్నికల్లో ముందుకు వెళ్తున్నారు. సిపిఎం పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీతో జతకట్టి ఎన్నికల్లో పోటీలోకి దిగింది.
మధిర మున్సిపాలిటీలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీతో సిపిఐ, సిపిఎం పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్(Congress) పార్టీని మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓడించడమే లక్ష్యంగా మూడు పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని మధిర మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో రుజువవుతోంది. నిన్న, మొన్నటి దాకా కాంగ్రెస్ తోనే మున్సిపాలిటీ ఎన్నికలకు వెళ్తామనుకున్న సిపిఐ పార్టీకి అపవాదు తప్పలేదు. కలిసి పోతామా..? అన్న ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీతో కలవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
Also Read: Bandi Sanjay: బీజేపీలో అత్యధిక మున్సిపల్ సీట్లు వారికే.. జాబితాను విడుదల చేసిన అధికారులు
అధికార కాంగ్రెస్ పార్టీ టిడిపి పార్టీతో కలిసి మధిర మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రణాళికలు రచించుకున్నాయి. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే సిపిఐ పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకునే పరిస్థితి ఉండేది. కానీ, వార్డుల సర్దుబాటు కుదరక సిపిఐ, కాంగ్రెస్ పార్టీలు విడిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ టిడిపి పార్టీతో కలిసి మధిర మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైపోయింది. అదేవిధంగా కాంగ్రెస్తో విడిపోయిన సిపిఐ పార్టీ బీఆర్ఎస్ పార్టీతో పొత్తు కుదుర్చుకొని, వారితోపాటు సిపిఎం పార్టీని కూడా కలుపుకొని మునిసిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సంసిద్ధులయ్యారు.
మధుర మున్సిపాలిటీ ఎన్నికల్లో మొత్తం 22 వార్డులకు గాను 10 వ వార్డు, 16వ వార్డు, 17వ వార్డులను టిడిపి పార్టీకి కేటాయించి మిగతా 19 వార్డుల్లో కాంగ్రెస్ పోటీ చేసేందుకు సిద్ధమైంది. టిడిపి అభ్యర్థులు వంకాయలపాటి నాగేశ్వరరావు, ములకలపల్లి వినయ్, కట్కూరి రేవతి లను మూడు వార్డుల్లో పోటీ చేసేందుకు బీ ఫామ్ లు అందించారు. అదేవిధంగా మూడు స్థానాలు 9, 15, 18 వార్డులు సిపిఎం పార్టీకి, ఒక స్థానం 7 వ వార్డు సిపిఐ పార్టీకి, మరో స్థానం 16వ వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థికి కేటాయించారు. మిగిలిన వార్డుల్లో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసేందుకు సిద్ధమైంది.
Also Read: Congress MPs Suspended: యార్ ఏంటి..? పార్లమెంట్లో ఇవేం మాటలు..? 8 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు