Kunamneni Sambasiva Rao: కర్రెగుట్టల్లో తక్షణమే కూంబింగ్ చర్యలు తక్షణమే నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్ఎ కూనంనేని సాంబశివరావు విజ్ఞప్తి చేశారు. మావోయిస్టులు చర్చలకు వచ్చేందుకు మార్గం సుగమం చేయాలని గురువారం పత్రిక ప్రకటనలో కోరారు. మావోయిస్టులు సైతం జనజీవనస్రవంతిలోకి వచ్చి, మార్కిస్టు సిద్ధాంతాన్ని విస్తరించేలా ఎత్తుగడలను మార్చుకోవాలని సూచించారు.
అడవుల్లోని లక్షల కోట ఖనిజ సంపద కోసం మహారాష్ట్ర, చత్తీస్ గడ్ జార్ఖండ్ లో లక్షలాది చెట్లు నరికివేయడాన్ని నిలిపివేయాలన్నారు. ఒకదగ్గర చెట్టును తొలగించాలంటే, మరో ప్రాంతంలో కొత్త మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలన్న గ్రీన్ ట్రైబ్యునల్ తీర్పు ఆసరాగా ఈ చర్యలకు పాల్పడడం సమంజసం కాదని, అడవిలో ప్రకృతి సహజంగా పెరిగిన చెట్లను కొట్టేసి, ఇతర ప్రాంతంలో అన్ని చెట్లు పెంచడం సాధ్యమా అని ప్రశ్నించారు. కార్పొరేట్ ఖనిజ సంపదను అప్పగించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నారని కూనంనేని విమర్శించారు. నక్సల్స్ పేరు చెప్పి మానవ హననానికి పాల్పడడం మానవత్వానికే మచ్చ అని అన్నారు. విశాల దృక్పథంతో ఆలోచించి వారిని జనజీవన స్రవంతిలో తీసుకురావడానికి ప్రభుత్వం తరపున కూడా కృషి చేయాలని అన్నారు.
Also Read: Child Rights: బాల్య వివాహ ముక్త భారత్ ప్రచార రథం ప్రారంభించిన అదనపు కలెక్టర్ భాస్కరరావు