Telangana DGP: తెలంగాణ డీజీపీగా సీ.వీ.ఆనంద్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కుటుంబ సభ్యులతో కలిసి డీజీపీ కార్యాలయానికి చేరుకున్న ఆయనకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పండితుల మంత్రోచ్ఛారణల మధ్య వారి ఆశీర్వచనాలతో ఆనంద్ డీజీపీ కుర్చీలో ఆసీనులయ్యారు. బాధ్యతలు స్వీకరించటానికి ముందు పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ తనను డీజీపీగా నియమించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పోలీసింగ్ లో తెలంగాణ.. దేశం మొత్తం మీద నెంబర్ వన్ గా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ ఇమేజ్ ను మరింతగా పెంచేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. ప్రభుత్వ నిర్ధేశిత లక్ష్యాలను సాధించే దిశగా పోలీసింగ్ ఉంటుందన్నారు. ఇప్పటికే శాంతిభద్రతలను కాపాడటంలో, నేర నియంత్రణ, కేసుల దర్యాప్తులో రాష్ట్ర పోలీసులు సమర్థంగా పని చేస్తున్నారని చెప్పారు. అయితే, అలసత్వానికి తావు ఇవ్వొద్దని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో నిత్యం అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. కేసుల విచారణలో అధునాతన టెక్నాలజీని వినియోగించుకోవటంలో తెలంగాణ పోలీసులు దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నారని ఆనంద్ చెప్పారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం నేరాల్లో మార్పు వచ్చిందన్నారు. ఏయేటికాయేడు పెరిగిపోతున్న సైబర్ నేరాలు ప్రస్తుతం సవాల్ గా మారాయని చెప్పారు.
యువతను నిర్వీర్యం చేస్తున్న డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతామని నూతన డీజీపీ స్పష్టం చేశారు. డ్రగ్స్ దందా చేసేవారు, వినియోగించేవారు ఎవరైనా సరే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. ఇప్పటికే మాదక ద్రవ్యాల కట్టడిలో ఈగిల్ ఫోర్స్, నార్కొటిక్ బ్యూరోలు సమర్థవంతంగా పని చేస్తున్నాయన్నారు. త్వరలోనే మరిన్ని నార్కొటిక్ సెల్స్ ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. విద్యా సంస్థల్లో యాంటీ డ్రగ్స్ కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర స్థాయిలో మేనేజ్ మెంట్ అండ్ రోడ్డు సేఫ్టీ బ్యూరోను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.
మహిళలు, చిన్నపిల్లల అక్రమ రవాణా వంటి సమస్యలు వ్యవస్థీకృత నేరాలుగా మారాయని ఆనంద్ అన్నారు. వీటిపై ప్రత్యేకంగా దృష్టి పెడతామని చెప్పారు. మహిళలు, చిన్నపిల్లల భద్రతకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తామన్నారు. బెట్టింగ్, స్మగ్లింగ్, ఆహార కల్తీ, రియల్ ఎస్టేట్ మోసాల వంటి నేరాలను నియంత్రించటానికి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలోనే రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని పునర్ వ్యవస్థీకరిస్తామని ఆనంద్ తెలిపారు. గతంలో మావోయిస్టుల కార్యకలాపాలను నియంత్రించటానికి గ్రే హౌండ్స్, ఎస్ఐబీ విభాగాల ఏర్పాటు జరిగిందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో మావోయిస్టు పార్టీ తన ఉనికిని పూర్తిగా కోల్పోయిందని చెప్పారు. ఈ నేపథ్యంలో గ్రే హౌండ్స్, ఎస్ఐబీల్లో పని చేస్తున్న సిబ్బందిని సైబర్ సెక్యూరిటీ, నార్కొటిక్స్ విభాగాలకు బదిలీ చేస్తామన్నారు.
Also Read: నిప్పుల కొలిమిలా తెలంగాణ.. మంత్రి అత్యవసర సమావేశం.. కీలక యాక్షన్ ప్లాన్ విడుదల
ప్రస్తుతం పోలీసు శాఖలో 19వేల ఖాళీలు ఉన్నట్టుగా ఆనంద్ చెప్పారు. వీటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇప్పటికే 5 వేల నియామకాలకు ప్రభుత్వ ఆమోదం వచ్చిందన్నారు. ఖాళీలపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్టు చెప్పారు. ఏసీబీ, సీఐడీ వంటి కీలక విభాగాలకు పూర్వ వైభవం తీసుకు రావటానికి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రైవేట్ సెక్టార్ లో ఉపయోగిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను పోలీసు శాఖలో కూడా అమలు చేస్తామన్నారు. నేర దర్యాప్తులో సీసీ కెమెరాలపై మాత్రమే ఆధారపడటం సరికాదని.. సీన్ ఆఫ్ అఫెన్స్లో దొరికిన ఆధారాలతోనే కేసులను ఛేదించే పాత పద్ధతులను మళ్లీ తీసుకొస్తామని స్పష్టం చేశారు. గోవధపై పోలీసులే చర్యలు తీసుకుంటారని, ప్రైవేటు వ్యక్తులు రోడ్లపైకి రావొద్దని సీవీ ఆనంద్ హెచ్చరించారు. ఇక, ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చివరి దశలో ఉందని ఆనంద్ చెప్పారు. త్వరలోనే ఈ కేసుపై సమీక్ష జరుపనున్నట్టు చెప్పారు. అనంతరం కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ ఈ కేసులో రెండో ఛార్జ్ షీట్ దాఖలు చేస్తుందని తెలిపారు.