Taj Express train attack: దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఝాన్సీ వెళ్తున్న తాజ్ ఎక్స్ప్రెస్ (12280) రైలుపై గుర్తుతెలియని దుండగులు జరిపిన దాడి ఘటన కలకలం రేపింది. రైలు ఢిల్లీ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ఈ దారుణం చోటుచేసుకుంది. పట్టాల పక్కన మాటువేసిన దుండగులు ఒక్కసారిగా ఇనుప రాడ్తో రైలుపైకి విసిరారు. అది వేగంగా వచ్చి కిటికీ అద్దాన్ని చీల్చుకుంటూ లోపలికి దూసుకెళ్లింది. ఈ క్రమంలో అక్కడ కూర్చున్న ఒక ప్రయాణికుడికి ఆ రాడ్ బలంగా తగలడంతో తీవ్ర రక్తస్రావమైంది.
అతని అరుపులు విన్న తోటి ప్రయాణికులు వెంటనే రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు. రైలును నిలిపివేసి బాధితుడిని చికిత్స నిమిత్తం హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఆకస్మిక దాడితో రైలులోని మిగిలిన ప్రయాణికులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. రైల్వే పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
రైళ్లపై వరుసగా జరుగుతున్న ఇలాంటి ఘటనలపై ప్రయాణికులు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే ట్రాక్ సమీపంలో భద్రతను కట్టుదిట్టం చేయాలని అధికారులను డిమాండ్ చేస్తున్నారు. నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించకపోతే భవిష్యత్తులో ఇలాంటి దాడులు పునరావృతమయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైల్వే రక్షక దళం (RPF) ఈ ప్రాంతంలో నిఘా పెంచాలని కోరుతున్నారు.
తాజ్ ఎక్స్ప్రెస్పై దుండగుల దాడి.. ప్రయాణికుడికి తీవ్ర గాయాలు
దేశ రాజధాని ఢిల్లీ నుండి ఝాన్సీ వెళ్తున్న తాజ్ ఎక్స్ప్రెస్ (12280) పై గుర్తుతెలియని దుండగులు ఇనుప రాడ్తో దాడి చేసిన ఘటన కలకలం సృష్టించింది. రైలు ఢిల్లీ నుండి బయలుదేరిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగింది. దుండగులు… pic.twitter.com/elxqO7zPBM
— ChotaNews App (@ChotaNewsApp) May 1, 2026
Read Also: నిప్పుల కొలిమిలా తెలంగాణ.. మంత్రి అత్యవసర సమావేశం.. కీలక యాక్షన్ ప్లాన్ విడుదల