Cyber Fraud: హైదరాబాద్లో ఆన్లైన్ బెట్టింగ్, క్యాసినో గేమ్స్ పేరుతో సైబర్ నేరగాళ్లు భారీ మోసానికి పాల్పడ్డారు. సికింద్రాబాద్కు చెందిన ఒక వ్యక్తిని టార్గెట్ చేసి, విడతల వారీగా ఏకంగా రూ. 75 లక్షలు వసూలు చేశారు. బాధితుడు మోసపోయానని గ్రహించి.. తాజాగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
సైబర్ నేరగాళ్లు ప్రధానంగా.. వాట్సాప్ ద్వారా బెట్టింగ్ యాప్లను, వెబ్సైట్లను విస్తృతంగా ప్రచారం చేశారు. మొదట బాధితుడికి తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టమని సూచించారు. వారు చూపించిన చిన్న లాభాలను చూసి, బాధితుడు ఆ యాప్లను నమ్మాడు. ఆ తర్వాత.. నిందితులు క్రికెట్ బెట్టింగ్లు, టీన్ పత్తి, క్యాసినో, అవియేటర్ గేమ్స్ వంటి అనేక రకాల గేమ్స్ పేరుతో భారీగా డబ్బులు పెట్టుబడి పెట్టాలని ఉసిగొల్పారు.
నెలల తరబడి వసూలు:
ఈ మోసం 2021 నుంచి 2025 వరకు సుదీర్ఘకాలం కొనసాగింది. ఈ నాలుగేళ్ల కాలంలో.. సైబర్ నేరగాళ్లు బాధితుడి నుంచి డబ్బును వివిధ మార్గాల ద్వారా వసూలు చేశారు. బాధితుడు అనేక బ్యాంక్ అకౌంట్లు, UPI ఐడీలు, QR కోడ్ల ద్వారా నిందితుల ఖాతాలకు భారీ మొత్తాలను డిపాజిట్ చేశాడు. మొదట్లో చిన్న మొత్తాలు గెలిచినట్లు చూపించడం ద్వారా బాధితుడికి తమపై నమ్మకం పెరిగేలా చేసి.. మోసం చేశారు.
పోలీసులకు ఫిర్యాదు:
రూ. 75 లక్షల భారీ మొత్తాన్ని పోగొట్టుకున్న తరువాత.. తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు ఆలస్యంగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. సైబర్ క్రైమ్ పోలీసులు బాధితుడి ఫిర్యాదును స్వీకరించి, కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు చేపట్టి, నిందితులు ఎక్కడ నుంచి పనిచేస్తున్నారు. ఏ అకౌంట్ లను ఉయోగించాలరు అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. ఇలాంటి ఆన్లైన్ బెట్టింగ్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
సైబర్ నేరగాళ్ల వలలో.. సీనియర్ న్యాయవాది, రూ. 72 లక్షలు మాయం
కడప జిల్లాలోని బద్వేల్ పట్టణంలోనూ మరో సైబర్ మోసం జరిగింది. ఈసారి ఏకంగా ఓ సీనియర్ లాయర్ను లక్ష్యంగా చేసుకుని సైబర్ కేటుగాళ్లు భారీ మొత్తంలో నగదును కాజేశారు. నేరగాళ్లు వ్యూహాత్మకంగా న్యాయవాదికి ఫోన్ చేసి, మాటల్లో పెట్టి అత్యంత చాకచక్యంగా ఆయన బ్యాంక్ అకౌంట్ నుంచి ఏకంగా రూ. 72 లక్షల 68 వేల రూపాయలను కొట్టేశారు. మోసపోయినట్లు తెలుసుకున్న బాధితుడు న్యాయవాది వెంటనే బద్వేల్ అర్బన్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
సాధారణంగా ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి ప్రముఖ నగరాల్లో ఎక్కువగా జరిగే సైబర్ నేరాలు.. ఇప్పుడు కడప జిల్లాలోని బద్వేల్ వంటి చిన్న పట్టణాలను కూడా లక్ష్యంగా చేసుకోవడం స్థానిక ప్రజల్లో తీవ్ర భయాందోళన కలిగిస్తోంది. ఈ ఒక్క ఘటనే కాకుండా.. బద్వేల్ పట్టణంలో చాలా మంది పౌరుల ఫోన్లు హ్యాక్ అయినట్లు కూడా పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి.
బద్వేల్ ప్రాంతంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్న.. దృష్ట్యా, పోలీసులు ప్రజలను అప్రమత్తం చేశారు. ఎవరైనా తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్కు స్పందించకూడదని, వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలను లేదా OTPలను ఎవరికీ పంచుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఈ కేసుపై బద్వేల్ అర్బన్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.